బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యతో ప్రశాంతంగా ఉండే కర్నాటకలోని శివమొగ్గ భగ్గుమంది. నగరంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అయినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితుల్ని అదుపుచేయడం కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నిన్నటినుంచీ లాఠీచార్జీలు చేస్తూ నిరసనకారుల్ని చెదరగొడుతున్నారు. అటు హర్ష హత్యకేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే అందర్నీ పట్టుకుంటామని …అందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అటు నిందితుల్లో ముగ్గురు బెంగళూరు పరారైనట్టు పోలీసులకు సమాచారం అందింది.
ప్రస్తుతం శివమొగ్గలో పరిస్థితి అదుపులో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా…నివురు గప్పినా నిప్పులా ఉందని చెప్పక తప్పదు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నాయి. భారతీ కాలనీలో ఉన్న హర్షను వెంటాడి మరీ కత్తులతో నరికిచంపారు దుండగులు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు బజరంగదళ్ సహా ఇతర హిందూ సంస్థల ప్రతినిధులు.
హర్ష హత్యతరువాత భారతీనగరకే పరిమితమైన అల్లర్లు నగరమంతా వ్యాపించాయి. నిరసనకారుల ఆందోళనల్లో 20 దుకాణాలు ధ్వంసమయ్యాయి. వాహనాల్నీతగులబెట్టారు. హర్ష అంతిమయాత్రలో ఉద్రిక్తం నెలకొంది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్ప వాయుగోళాల్ని ప్రయోగించారు. లాఠీ చార్ది కూడా చేయడంతో 20మందికి పైగా కార్యకర్తలు గాయపడ్డారు. అటు హర్ష మృతితో ఆసరా కోల్పోయిన ఆ కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని శ్రీరామసేన డిమాండ్ చేసింది.
హర్ష కుటుంబానికి హోన్నలి బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య రూ.2 లక్షలు, మహదేవపుర ఎమ్మెల్యే అరవింద లింబావళి రూ. లక్ష పరిహారాన్ని ప్రకటించారు.