అయోధ్యలో భగవానుడైన రామచంద్ర ప్రభువు కి భవ్యమైన ఆలయం నిర్మించారు. దేశ ప్రజలంతా భక్తి ప్రపత్తులతో ఇచ్చిన విరాళాలతో అనేక మందిరాల సముదాయంగా ఈ రామ మందిరం నిర్మితమయింది. దీనిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఒక అద్భుత పుణ్యక్షేత్రంగా అయోధ్య రామాలయం మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తోంది. కేవలం జీఎస్టీ ద్వారానే స్పష్టమైన ఆదాయం వస్తోంది అని అక్కడి ట్రస్ట్ నాయకులు చెబుతున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం సేకరిస్తున్న సామాగ్రి సేవలకు గాను ఎప్పటికప్పుడు జిఎస్టి బిగించడం జరుగుతుంది. దీనిని క్రమం తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది అని ట్రస్ట్ పెద్దలు స్పష్టంగా చెబుతున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి అయోధ్య ట్రస్ట్ ముఖ్య నిర్వాహకులు చంపత్ రాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా అంచనా ప్రకారం రామమందిర నిర్మాణంతో ప్రభుత్వానికి రూ.400 కోట్ల జీఎస్టీ రూపంలో సమకూరింది.. మందిర ప్రాంగణంలో మొత్తం 70 ఎకరాల్లో 18 ఆలయాలను నిర్మించనున్నాం.. మహర్షి వాల్మీకి, శబరి, తులసీదాస్ సహా పలు ఆలయాలు ఇందులో ఉంటాయి.. మేము 100 శాతం పన్ను చెల్లిస్తున్నాం.. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేదు’ అని చంపత్ చెప్పారు.
ఆలయ నిర్మాణం వివరాలను ఆయన వివరించారు.
తొలి దశ నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో బాలక్ రామ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఒకవేళ రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చని ట్రస్ట్ కార్యదర్శి చెప్పారు.
‘రామమందిర నిర్మాణ కోసం జరిగిన ఉద్యమం వల్ల ఎంత మంది ప్రజలు, వారి కుటుంబాలు, బంధువులు ఇబ్బందిపడ్డారో నాకు తెలియదు. ఈ ఈ యాగం (ఉద్యమం) స్వాతంత్య్రం కోసం 1,000 ఏళ్లు నాటి పోరాటం కంటే తక్కువ కాదు. ఇది (ఆందోళన) ప్రజా సంక్షేమం కోసం జరిగింది’ అని పేర్కొన్నారు.
మరోవైపు అయోధ్యకు వివిధ రవాణా మార్గాలలో భక్తులు వస్తుండడంతో వీటి ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అంతేకాకుండా అయోధ్య చుట్టుపక్కల పూర్తిస్థాయిలో వ్యాపార కార్యక్రమాలు రూపం అందుకున్నాయి వీటి ద్వారా కూడా ప్రభుత్వాలకు ఆదాయం వచ్చి పడుతోంది మొత్తంమీద రామచంద్ర ప్రభు భక్తులను అనుగ్రహిస్తూనే ప్రభుత్వాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు అనుకోవచ్చు.