ఐదు రాష్ట్రాల ఎన్నికలపై జాతీయ స్థాయి మీడియా సంస్థలుగా చెలామణి అయ్యే కొన్ని చానళ్ల సర్వేలు సత్యానికి ఎంత దగ్గరగా ఉన్నాయనేది అనుమానమే. ఎబిపి, టైమ్స్ నౌ చానళ్ల సర్వేలు బెంగాల్ విషయంలో బిజెపి వ్యతిరేకంగా, తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. పలు బెంగాలీ ప్రాంతీయ చానళ్ల సర్వేల ప్రకారం బిజెపి 170 సీట్లకు పైగా గెల్చుకుంటుంది. తాజాగా పీపుల్స్ పల్స్ అనే సంస్థ ప్రాంతాల వారీగా సమగ్ర సర్వే అంచనాలను ప్రకటించింది. దాని ప్రకారం బిజెపి 160 సీట్లలో గెలిచే అవకాశం ఉంది. మరో 39 సీట్లలో గట్టి పోటీ ఉంది. కానీ ఎబిపి, టైమ్స్ నౌ సర్వే రిపోర్టులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ రెండు మీడియా సంస్థల నిజస్వరూపం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం.
2019 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 303 సీట్లు గెల్చుకుని భారీ మెజారిటీతో రెండో సారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లు గెల్చుకుంది. ఆ ఎన్నికల సమయంలో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం ఎలా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. టైమ్స్ నౌ అప్పట్లో సర్వే చేసి బిజెపి 279 సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 149 సీట్లు సాధిస్తుందని లెక్కగట్టింది. ఇది వాస్తవానికి ఎంత విరుద్ధంగా ఉందో అర్థమవుతుంది.
ఇక ఎబిపి న్యూస్ చానల్ కూడా అంతే. ఆ సంస్థ సర్వే ప్రకారం బిజెపి 233 సీట్లు గెలుస్తుందనేది అంచనా. అంటే మెజారిటీ రాదని, హంగ్ వస్తుందని అర్థం. ఇక కాంగ్రెస్ పార్టీ 167 సీట్లను సాధిస్తుందని అంచనా వేసింది. ఈ సర్వే పచ్చి అబద్ధమని వాస్తవ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ లోనూ కాంగ్రెస్ 100 సీట్లకు పైగా గెలుస్తుందని ఈ రెండు చానల్స్ అంచాన వేశాయి. వాస్తవానికి హస్తం పార్టీకి వచ్చిన సీట్లు 52 మాత్రమే. కాబట్టి ఇప్పుడు బెంగాల్ లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని ఈ రెండు సంస్థలూ సర్వే రిపోర్టులుగా ప్రకటించిన అంచనాలు ఏమాత్రం నమ్మతగినవి కావు. బిజెపి విజయం ఖాయమని ప్రాంతీయ చానళ్లు మాత్రమే కాదు, ఆ రాష్ట్రంలో ఎటు చూసినా కమలం ప్రభంజనం స్పష్టంగా తెలుస్తుంది.