ప్రజాగ్రహసభలో చీప్ లిక్కర్ గురించి ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యపైనే తెలుగురాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఆ సభలో సోమువీర్రాజు ఇంకా చాలా మాట్లాడారు. కానీ 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామన్న మాటను మాత్రమే ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు.
ప్రభుత్వమే సారా కాయిస్తూ 3 రూపాయలు ఖర్చయ్యే మద్యాన్ని 25 రూపాయలకు కొనుక్కొని.. 250కి అమ్ముతోందని చెపుతూ ఈ వ్యాఖ్య చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారనీ ఆయన అన్నారు..
ఎన్టీ రామారావు వారుణి వాహిని అంటూ మంచినీళ్ల ప్యాకెట్లలా మందు ప్యాకెట్లు తయారు చేయించి జనాల్లో ఎక్కించినప్పుడు నోరు మూసుకున్న వాళ్ళు, మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచినప్పుడు నోరు లేవనివాళ్ళు, కొత్త కొత్త సరికొత్త బ్రాండ్లతో సారాని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న జగన్ గురించి మాట్లాడలేని అర్భకులు ఇప్పుడు సోము వీర్రాజు స్టేట్మెంట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. సామాన్యులు తాగే ఇండియన్ మేడ్ చీప్ లిక్కర్ ధరలు తగ్గిస్తాం అన్నప్పుడు ఆ లిక్కర్ విషయంలో ప్రభుత్వాలు పేద వాడిని చేస్తున్న దోపిడిని అరికడతాం అన్నది సోము వీర్రాజు ఉద్దేశం.
ప్రభుత్వాలు, వ్యాపారులు లాభాల కోసం సారా ధరలను విపరీతంగా పెంచితే తాగేవాళ్లు కల్తీ సారా, నాటుసారా, కలుషిత మద్యం వైపు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం గురించి నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ మద్య నిషేధం లేదా నియంత్రణ రావాలి అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ కౌన్సిలింగ్ మరియు డిఎడిక్షన్ సెంటర్లు పెట్టాలి.
కానీ ఇప్పుడు ప్రభుత్వాలు రాబోయే కొన్ని దశాబ్దాలు తాము అమ్మబోయే మద్యాన్ని హామీ పెట్టి అప్పులు తెచ్చి ఆ డబ్బులను ఓట్ల ఉచిత పధకాలకు ఖర్చు పెడుతున్నాయి. అవినీతికి తెరతీస్తున్నాయి. సారా రేటు తగ్గించినంతమాత్రాన విపరీతంగా తాగరు ఎవరూ. అలవాటు అయిన వాళ్లు ఎప్పుడూ తాగేది ఒకటే. కానీ సారా ధర పెరిగినప్పుడు గత్యంతరం లేక కల్తీ సారా తాగుతున్నారు. ఇంకా ప్రమాదకరమైన విషయాల జోలికి వెళ్తున్నారు.
విచిత్రం ఏమిటంటే రోజూ శుభ్రంగా మందు కొట్టే మందుబాబులు రాజకీయంగా సోము వీర్రాజు మాటలను విమర్శించడం.!
– కృష్ణ సిహెచ్
టెక్నాలజీ, ప్రింటింగ్ & మీడియా