బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మూడవ విడత ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమైంది. ప్రారంభ సభకు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి హాజరుకానున్నారు. తొలి రెండు విడతల యాత్ర విజయవంతం కావడంతో.. ఈసారి కూడా అదే ఊపును కొనసాగించేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. బండి సంజయ్ ఉదయం 10 గంటలకు యాదాద్రికి చేరుకుని కేంద్రమంత్రులతో కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామికి పూజలు చేశారు. మూడో విడత పాదయాత్ర 24 రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని 25 మండలాల మీదుగా 328 కిలోమీటర్ల మేర కొనసాగే ఆయన మూడోవిడత పాదయాత్ర వరంగల్లోని భద్రకాళి ఆలయ సందర్శనతో ముగుస్తుందని బీజేపీ నేతలు తెలిపారు.
ఇవాళ బండి సంజయ్ 10.5 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. యాదగిరిపల్లి, గాంధీనగర్, యాదగిరిగుట్ట ప్రధాన రహదారి మీదుగా గణేష్నగర్ నుంచి శుభం గార్డెన్కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి, తిరిగి పాతగుట్ట, గొల్లగుడిసెలు మీదుగా దాతారుపల్లికి చేరుకుని అక్కడ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి బస్వాపూర్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.