మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిఆదిత్యనాథ్ ను ఇరికించే ప్రయత్నం జరిగిందా? సాక్షాత్తూ ముంబై ఏటీఎస్ ఈ కుట్రకు పాల్పడిందా? నాటి పేలుళ్ల కేసులో ఆదిత్యనాథ్ పేరు చెప్పాలని మహారాష్ట్ర ఏటీఎస్ ఒత్తిడి చేసిందని పేలుళ్ల సాక్షి ఒకరు ఎన్ఐఏ కోర్టుకు తెలిపారు. అంతేకాదు మరికొందరు ఆర్ఎస్ఎస్ ముఖ్యుల పేర్లూ చెప్పాలని తనను హింసించారని కోర్టుకు వివరించారు.
‘నాటి ఎంపీ, నేటి యూపీ సీఎం యోగీఆదిత్యనాథ్ పేరు చెప్పాలని మహారాష్ట్ర ఏటీఎస్ నాపై ఒత్తిడి చేసింది.. అంతేకాదు మరికొందరు ఆర్ఎస్ఎస్ ముఖ్యుల పేర్లూ చెప్పాలని హింసించింది. యోగీ ఆదిత్యనాథ్. ఇంద్రేష్ కుమార్, దేవధర్, కాకాజీ సహా ఐదుగురు ఆర్ఎస్ఎస్ ముఖ్యుల పేర్లు చెప్పాలని బలవంతం చేశారు’ అని అతను కోర్టుకు స్పష్టం చేశారు.
పేలుళ్లు జరిగిన తరువాత ఏడు రోజుల పాటు తనను ముంబై ఏటీఎస్ కార్యాలయంలోనే ఉంచారని తరువాత నాటి బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పకపోతే తన కుటుంబసభ్యులకు చిత్రహింసలకు గురిచేస్తామని, కేసుల్లో ఇరికిస్తామని ఏటీఎస్ అధికారులు బెదిరించారని వాపోయారు.
2017 పేలుళ్ల కేసు నిందితుల్లో ఒకరైన సుధాకర్ చతుర్వేది సైతం గతంలో ఈ విషయమే చెప్పారు. అమాయకులను కాషాయ ఉగ్రవాదం పేరుతో ఏటీఎస్ ఇరికించిందని అన్నారు. యోగీ ఆదిత్యనాథ్ తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నూ కేసులో ఇరికించే కుట్ర పన్నారనీ తెలిపారు.
9 ఏళ్ల తరువాత బెయిల్ పై విడుదలయ్యారు చతుర్వేది. ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే నాటి కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారు హిందూ కార్యకర్తల్ని ముప్పుతిప్పలు పెట్టిందన్నారు. యోగితో పాటు ఆయన సంస్థ హిందూ యువవాహిని గురించిన వివరాల గురించి ప్రశ్నించారని… కాషాయం ధరించిన ఓ ఎంపీని కేసులో ఇరికించడమే లక్ష్యమని వాళ్ల మాటల్లో అర్థమయ్యేదనీ అన్నారు. నిందితులమంటూ తమను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారని చతుర్వేది కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాదు పిస్టల్, ఆర్డీఎక్స్ లభించాయంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని ఆరోపించారు.
సెప్టెంబరు 29, 2008న మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని మాలెగావ్ లో జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు చనిపోయారు. 80మంది గాయపడ్డారు. కొద్దిరోజులకే పేలుళ్ల సూత్రధారులంటూ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ ను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో కాషాయ ఉగ్రవాదం, కాషాయ టెర్రరిస్టులు అంటూ పలు వామపక్ష,సెక్యులర్ పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. 2017 ఆగస్టు వరకు సాధ్వి ప్రజ్ఞ, పురోహిత్ జైలులోనే ఉన్నారు.