మద్యం పాలసీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే కేసులనుంచి రిలీవ్ అవచ్చని మెసేజులు వస్తున్నాయని చెప్పారు. ఆప్ ను విడిచి బీజేపీలో చేరితే.. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులన్నీ కొట్టివేస్తారన్నది ఆ సందేశం సారాంశమని చెప్పారు. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్లో షేర్ చేశారు సిసోడియా. అయితే తాను మహారాణా ప్రతాప్ వంశస్తుడినని తలైనా నరుక్కుంటా తప్ప అవినీతి – కుట్రదారుల ముందు తలవంచనని సిసోడియా అన్నారు. బీజేపీ చాలాకాలంగా ఆప్ ను చీల్చాలని చూస్తోందని… వారి ఆటలు సాగబోవని ఆయన హెచ్చరించారు.
ఈ ఏడాది మొదట్లో ఆప్ సర్కార్ తీసుకువచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు, అవినీతి జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. సిసోడియా సహా 15మంది కేసు నమోదు చేసిన సీబీఐ…ఆయనతో పాటు పలువురి ఇళ్లల్లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే మనీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సిసోడియా ఆరోపణల్ని ఖండించింది బీజేపీ.