తాను సేవ చేస్తున్నా తప్ప వ్యాపారం చేయడం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తమ మీద కుట్ర చేస్తోందన్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని ఆయన అన్నారు. తమనే కాదు కేసీఆర్ కూడా ఎవరూ ఏమీ చేయలేరన్నారు మంత్రి. ఎంతోమంది పేద విద్యార్థులకు విద్య అందిస్తున్నానని చెప్పుకొచ్చారు.
గతంలోనూ తమపై రెండుసార్లు దాడులు జరిగాయని ఇంత కుట్ర ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్మి, బోర్లు వేసి పైకి వచ్చానన్నారు.తమ విద్యావ్యవస్థల వ్యవహారాలు అన్నీ ఆన్లైన్ లోనే జరుగుతున్నాయన్న మల్లారెడ్డి… మేనేజ్మెంట్ కోటా లేకపోతే డొనేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తన కొడుకు ఆస్పత్రిలో ఉన్నా అధికారులు కనికరం చూపలేదన్నారు. తన పెద్దకొడుకును మానసికంగా వేధించి సంతకం పెట్టించారని ఆరోపించారాయన. వందకోట్ల బ్లాక్ మనీ తమ దగ్గర ఉందని అధికారులే సంతకాలు పెట్టించారని… ఇంకో మూడు నెలలు తమకు వేధింపులు ఉంటాయన్నారు మంత్రి.
మల్లారెడ్డి, ఆయన సంబంధీకుల ఇళ్లల్లో రెండురోజుల పాటు జరిపిన సోదాల్లో ఐటీ అధికారులు 8 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.