వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికార టీఎంసీని కూలదోసి.. కమలం జెండా ఎగరేయాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల ప్రచారం కూడా చేపడుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రశ్రేణి స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఓ వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. మరోవైపు యూపీ ఫైర్ బ్రాండ్ యోగీ ఆదిత్యానాథ్ కూడా ప్రచారం చేపడుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వెస్ట్ మిడ్నాపూర్లో జరిగిన ఓ బహిరంగ సభలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాము గంగూలీలా క్రీజ్ దాటి ముందుకు వచ్చామని.. గంగూలీ క్రీజ్ దాటితే సిక్స్ర్ కొట్టేవాడన్నారు. అలాగే తాము 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో క్రీజ్ దాటామని.. ఇప్పుడు సిక్సర్ల మోత మోగించడమేనంటూ ఓటర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల ప్రచారంలో గంగూలీ పేరును రాజ్నాథ్ ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గంగూలీ బీజేపీ గూటికి చేరుతున్నట్లు పలుమార్లు పుకార్లు షికార్లయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిక్సర్లు కొట్టి.. టీఎంసీని కూల్చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.