రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ గురించి అసలు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంఘ అఖిల భారతీయ కార్యకారిణీ సదస్సులు డాక్టర్ మన్మోహన్ జీ వైద్య అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి లో “మ్యాన్ ఆఫ్ ద మిలీనియా డాక్టర్ హెగ్డేవార్” అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ విశిష్ట అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా మన్మోహన్ వైద్య మాట్లాడుతూ సంఘ స్థాపన, విస్తరణ గురించి అనేక విషయాలు వివరించారు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి డాక్టర్జీ ఆధునికంగా కూడా ఆలోచించేవారని, అసలు యూనిఫారమ్ (గణవేష) అన్న పద్ధతే హిందూ సమాజంలో వుండేది కాదని, కానీ.. సమానత, ఏకత కోసం యూనిఫారమ్ అవసరమని డాక్టర్జీ ఆలోచించారన్నారు. దీని కోసం ధోవతి, కుర్తా లాంటివి కూడా తీసుకురావచ్చు గానీ.. హెడ్గేవార్ సంఘానికి అత్యంత ఆధునికమైన మిలటరీ యూనిఫారాన్ని సంఘానికి తీసుకొచ్చారన్నారు. అదేవిధంగా పరేడ్ అనేది కూడా హిందూ సమాజానికి కొత్తదని, భారతీయ రాజుల సేనలు కూడా ఈ పరేడ్ను చేసేవారు కాదన్నారు. కానీ… సమాజంలో ఓ అనుశాసనత (క్రమశిక్షణ) తీసుకురావడానికి ఈ పరేడ్ అవసరమని డాక్టర్జీ ఆలోచించారని, ఇప్పుడు దానిని సంఘంలో సమత అంటున్నారన్నారు. అలాగే బ్యాండ్తో సహా పరేడ్ చేయడం హిందూ సమాజంలో లేదని, శౌర్య భావన తీసుకురావడానికి సంఘానికి డాక్టర్జీ పరిచయం చేశారన్నారు. వీటన్నింటినీ చూస్తే… ఆధునికత అన్న అంశాన్ని డాక్టర్జీ అసహ్యించుకునేవారు కాదని అర్థమవుతోందని, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి దానిని స్వీకరిస్తూనే… మూలాన్ని మాత్రం విడిచిపెట్టలేదన్నారు.
సంఘ విస్తరణ గురించి మన్మోహన్ వైద్య స్పష్టమైన వివరణ ఇచ్చారు. 1945 లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందని, అప్పుడు ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్ చాలా దెబ్బతిన్నాయని, తిరిగి తమ దేశాలను పునర్ నిర్మించుకోవాలని పనిని ప్రారంభించాయి అని అన్నారు. తమకున్న అతి తక్కువ వనరులతో ప్రారంభించాయి అని అన్నారు. 1947 లో భారత్కి స్వాతంత్రం వచ్చిందన్నారు. అయితే.. పై దేశాల్లాగా మన దేశం అంతలా దెబ్బతినలేదన్నారు. అయితే.. గత 70 ఏళ్లలో ఈ దేశాలు ఎంతగా అభివృద్ధి చెందాయో భారత్ అంతలా అభివృద్ధి చెందలేదన్నారు. ఈ నాలుగు దేశాలు కూడా తామెవరో తెలుసుకున్నారని, వారి పూర్వజుల గురించి, వారి మూలాలు తెలుసుకోవడం వల్లే తిరిగి వేగంగా పుంజుకున్నారని వివరించారు.
కానీ.. భారత్ పురోగతికి అసలు సమస్య ఏమిటంటే మన్మోహన్ వివరంగా చెప్పారు.
భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య, రక్షణ, ఆర్థిక రంగాలు మన మూలాల మీద నడవడం లేదని, పశ్చిమ దేశాలను అనుసరించడం వల్లే ఈ దుర్గతి అని ఆయన అన్నారు. భారత్ ఇతిహాసం కొన్నివేల సంవత్సరాలదని, కానీ.. కొత్త కొత్త దేశాలను అనుసరించడం వల్లే ఈ ఇబ్బందులన్నారు. యూరోపియన్ దేశాల్లో అన్ని పనులు ప్రభుత్వాలే చేస్తుంటాయని, ఇది భారత్ పద్ధతి కాదని ప్రముఖ కవి రవీంద్ర నాథ్ ఠాగోర్ అనేవారని, రాజ్యం మీద అతి తక్కువ ఆధారపడే సమాజమే ‘‘స్వదేశీ సమాజ’’ లక్షణమని ఆయన అనేవారని మన్మోహన్ వైద్య గుర్తు చేశారు.
ఇక.. అప్పట్లో సంఘ ప్రార్థన చివర్లో సమర్థ రామదాసు స్వామి మహారాజ్ కీ జై అని అనేవారమని.. దీంతో సమర్థ రామదాస్నే గురువుగా భావించే వీలుండేదని, అలాగే చాలా మంది డాక్టర్జీయే గురువు అని అనుకునేవారని, కానీ..సంఘ్ గురువుని ఎంచుకునే ప్రక్రియలోనూ డాక్టర్జీ అత్యంత భిన్నమైన శైలిని ఎంచుకున్నారన్నారు. ఎందుకంటే సంఘ్ పని మొత్తం హిందూ సమాజాన్ని సంఘటితం చేసే పని అని, ఈ సమాజం అత్యంత ప్రాచీన సమాజం అని, అలాగే గురువు కూడా అత్యంత ప్రాచీనతను సూచించేదిగా వుండాలని భావించి, భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించారన్నారు. అయితే.. సంఘానికి సంబంధించిన ధ్వజంపై ఎలాంటి గుర్తూ లేదని, ఎందుకంటే.. మొత్తం సమాజాన్ని సంఘటితం చేస్తుందని, ఇదేదో సమాజంలో ఓ సంస్థ కాదన్నారు. వీటన్నింటినీ చూస్తే.. హెడ్గేవార్ది ఎంత దూరాలోచనో అర్థమవుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ నిట్టా మాట్లాడుతూ మన సమాజంలో సంఘ్ ముఖ్య భూమిక పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. పుస్తక పరిచయ కార్యక్రమాన్ని క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ నిర్వహించారు.