కాశ్మీర్ విషయంలో అమెరికా రాయబారం మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కాశ్మీర్ సహ అనేక అంశాల మీద పాకిస్తాన్ తో నేరుగానే తేల్చుకుంటామని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు నరేంద్ర మోడీ స్పష్టతతో తెరపడినట్లు అయింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో ఈ కలకలం రేగింది. కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. దీంతో అమెరికా రాయబారాన్ని మోదీ కోరుకుంటున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ దమారం రేపింది. దీని మీద స్పష్టత ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా లేఖ రాశారు. అంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిమీద పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చేశారు. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటేనని మోదీ కుండబద్దలు కొట్టారు. కాశ్మీర్ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదని సుస్పష్టం చేశారు. ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాక్ మాట్లాడితే తామూ మాట్లాడతామని ప్రధాని మోదీ చెప్పారు.
ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి కొత్త సందేశం పంపామని చెప్పారు. ఉగ్ర శిబిరాల సహా హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేశామని గుర్తు చేశారు. వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టామని, ఉగ్రదాడులు ఆగే వరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.
ఇక త్రివిధ దళాల అధిపతులకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని పేర్కొంటూ పాక్ దాడులకు దిగితే భారత్ సైతం ఎదురుదాడి చేస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.
పాక్ కాల్పులకు దిగితే గట్టిగా బదులివ్వండంటూ త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని మోదీ సూచించారు. పాకిస్థాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ప్రధాని ఆదేశించారు. పాకిస్థాన్ ప్రతీ చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు.
దీన్ని బట్టి పాకిస్తాన్ విషయంలో భారత్ ప్రభుత్వం స్పష్టంగా ముందుకు వెళుతున్నది అని అర్థం అవుతోంది. ప్రతిపక్షాల గందరగోళ ప్రకటనలతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ నడుస్తోంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం స్పష్టత తోటి ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.