నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ డీల్ తో ముడిపడి ఉన్న ఆర్థిక నిర్ణయాలన్నీ దివంగత మోతీలాల్ వోరా తీసుకున్నట్లు రుజువు చేయడానికి కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఎటువంటి పత్రాలు ఇవ్వలేదని ఈడీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా ఎక్కువ కాలం పనిచేసిన వోరా 2020లో మరణించారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. యంగ్ ఇండియన్-ఎజెఎల్ డీల్ కు సంబంధించిన ఆర్థిక అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీని ప్రశ్నించినప్పుడు, అన్ని లావాదేవీలను వోరా నిర్వహించారని అధికారులకు చెప్పారు. రాహుల్, సోనియాతో పాటు కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, పవన్ కుమార్ బన్సాల్ కూడా ఆయన పేరునే చెప్పారు. అయితే అలాంటిది ఏదైనా జరిగితే అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించడంలో ఈ నేతలందరూ విఫలమయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
యంగ్ ఇండియన్ కంపెనీలో మల్లికార్జున్ ఖర్గే ఏకైక ఉద్యోగి అయినందున పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఖర్గేను పిలవడం తప్ప ఈడీకి వేరే మార్గం లేదని కూడా ఆ వర్గాలు తెలిపాయి.
మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఢిల్లీలోని కాంగ్రెస్ యాజమాన్యంలోని న్యూస్ పేపర్ నేషనల్ హెరాల్డ్ ప్రాంగణంలో ఉన్న యంగ్ ఇండియన్ కార్యాలయానికి ఈడీ తాత్కాలికంగా సీల్ వేసిన విషయం తెలిసిందే.