భారత్ లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని రాహుల్ గాంధీ అన్నారు. కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్లో విజిటింగ్ ఫెలో గా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలే చేశారు. తన ఫోన్లో పెగాసస్ ఉందని… చాలామంది రాజకీయ నాయకుల ఫోన్లలోనూ పెగాసస్ ఉందని అధికారులే స్వయంగా తనకు చెప్పారని ఆయన అన్నారు. మీడియా న్యాయవ్యవస్థలను ప్రభుత్వం నియంత్రిస్తోందని,కబ్జా చేస్తోందని రాహుల్ ఆరోపించారు. మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులు చేస్తోందనీ మండిపడ్డారు.
వారంరోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా… బిగ్ డేటా అండ్ డెమొక్రసీ మీద ఆయన మాట్లాడారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే చాప్టర్ సమావేశం, ఇండియన్ డయాస్పోరా కాన్ఫరెన్స్లలో కూడా ఆయన పాల్గొంటారు. అటు రాహుల్ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రశంసలు కురిపిస్తుండగా బీజేపీ మండిపడుతోంది. పెగాసస్ లేదని సుప్రీం కోర్టే చెప్పినా దేశంబయట ఇంత పచ్చి అబద్ధాలేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.