తెలంగాణలో అధికారం లోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో హామీలు ఇచ్చింది అందులో ప్రధానమైనది రైతు భరోస పెంపు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వానికి రైతు భరోసా బాగా పేరు తీసుకుని వచ్చింది ఇంకా చెప్పాలి అంటే 2018 ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించింది కూడా ఇదే పథకం అనుకోవచ్చు. సరిగ్గా పోలింగ్ కి రెండు మూడు రోజులు ముందు రైతుల ఎకౌంట్లో టప టపా డబ్బులు పడ్డాయి. పంటల సీజన్లో చేతిలో డబ్బులు లేక అల్లాడుతున్న రైతాంగానికి కేసీఆర్ ఒకసారిగా దేవుడు లా కనిపించాడు. దీంతో 2018 ఎన్నికల్లో రైతులు, వ్యవసాయ కూలీలు… మొత్తంగా గ్రామీణ ప్రజానీకం గులాబీ పార్టీకి ఓట్లేసి గెలిపించారు.
తెలంగాణలో సహజంగానే గ్రామీణ జనాభా అధికం అందులో ఎక్కువ మంది వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉంటారు దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల కోసం భారీగా హామీలు గుప్పించింది. అందులో భాగంగా రైతులకు భరోసా ఇస్తామని పంట రుణాలు మాఫీ చేస్తామని భారీ వాగ్దానం చేయడం జరిగింది.
కానీ రైతుల సంక్షేమ పథకాలు అమలు కి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు కనిపించడం లేదు. రెండు నెలల పాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కనీసంగా 30 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థిక శాఖ అంచనా. ఖరీఫ్ పంటల సాగు మొదలయ్యేలాగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని బ్యాంకుల ఖాతాలో వేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆగస్టు 15లోగా రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు. ఈలోగా ఇంకొక కష్టం వచ్చి పడింది. ఆగస్టు 13 లోగాని కర్షకులకు జీవిత బీమా కల్పించే రైతు బీమా పథకం ప్రీమియం చెల్లించాలి. 30 లక్షల మంది రైతుల కోసం 1500 కోట్ల రూపాయలను ఎల్ఐసి కి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి. లేదంటే ఆ పథకాన్ని అమలు చేయడం కష్టం అవుతుంది.
రైతు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ప్రజల్లో తీవ్ర నిరసన ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రజల నుంచి నిరసన మొదలవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో సగం మాత్రమే సీట్లు కాంగ్రెస్కు దక్కాయి. అది కూడా బిజెపి భావనలు ఇష్టపడని కమ్యూనిస్టు వాసనలు ఉండే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి మద్దతు లభించింది. లేనట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరింత చికాకులు ఎదురయ్యేవి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న మార్గాలు రెండే రెండు… ఒకటి ఆదాయం పెంచుకోవడం ,, అంటే రైతు సంక్షేమ పథకాల అమలుకి వివిధ మార్గాల్లో డబ్బులు సేకరించడం. రెండు ఖర్చు తగ్గించుకోవడం,, అంటే రైతు సంక్షేమ పథకం లబ్ధిదారులని రకరకాల మార్గాల ద్వారా తగ్గించడం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మార్గాలను బలంగా ఉపయోగిస్తోంది.
ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 14 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే అంతకు మించిన ఖర్చులతో భారంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అటువంటప్పుడు రైతు సంక్షేమ పథకానికి వేరే మార్గంలోనే నిధులు సేకరించాలి. బాండ్ల విక్రయం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తం లో డబ్బులు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ లో ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు తెచ్చేందుకు మార్గాన్ని అన్వేషిస్తున్నారు. ఇందుకు కూడా ప్రభుత్వం నుంచి గ్యారెంటీ సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ విపరీతంగా వడ్డీ పేరుకుపోయి రాగల రోజుల్లో తెలంగాణ సమాజం మొత్తానికి అప్పుల గుది బండగా మారే ప్రమాదం ఉంది.
లబ్ధిదారుల సంఖ్యను రకరకాల కారణాలతో తగ్గించడం మేలు అన్నది ఐఏఎస్ అధికారుల వాదన. ఇది రాజకీయంగా ఇబ్బంది అయినప్పటికీ … రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మార్గాన్ని కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పంటలు సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా కల్పిస్తామని ఇప్పటికే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండ బద్దలు కొట్టేశారు. అంటే పొలం ఉన్నప్పటికీ వృత్తిగా వ్యవసాయాన్ని చూపించకపోతే రైతు భరోసా దక్కదు అన్నమాట. అంతేకాకుండా ఆదాయపు పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వ లేక ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నవారికి, వ్యవసాయం కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయం పొందే వారికి రైతు భరోసా ఇవ్వకూడదు అని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి కఠినమైన ఆంక్షలు పెట్టినట్లయితే లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పెట్టచ్చని భావన. అటు రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇదే సూత్రాన్ని అమలు చేయబోతున్నారు. మొదటగా 50 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత 75 వేల లోపు వారికి అనంతరం లక్షలోపు వారికి రుణాలను మాఫీ చేస్తారు. దాదాపుగా 70 శాతం రైతులు లక్షలు లోపు మాత్రమే రుణం కలిగి ఉన్నారు.
ఈ లెక్కలన్నీ బాగానే ఉన్నప్పటికీ… ఎన్నికల ముందు అన్ని రకాల సంక్షేమ పథకాలను ఎటువంటి కోత లేకుండా అమలు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు పదేపదే చెప్పారు . అంతేకాకుండా ఇంటింటికి గ్యారెంటీ కార్డులు కూడా పంచారు. కానీ ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకుండా… కుంటి సాకులు చెప్పినట్లయితే ప్రజల ఎంతవరకు ఊరుకుంటారనేది పెద్ద ప్రశ్న. సరి కదా వ్యవసాయదారుల సంక్షేమానికి చిల్లు పెడితే రైతులు ఆగ్రహం… వచ్చే స్థానిక ఎన్నికల్లో పడటం ఖాయం. ఇప్పటికే పగతో రగిలిపోతున్న బీఆర్ఎస్ పార్టీ , బిజెపి పార్టీ రైతుల తరఫున ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలైతే రాగల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. అందుచేత శక్తికి మించిన భారమైనప్పటికీ ఈ ఏడాది వరకు రైతు సంక్షేమ పథకాలను ఓ మోస్తరు గా అమలు చేసి ,,వచ్చే ఏడాది భారీగా కోతలు పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.