ఇప్పుడు కెనడాలో ట్రక్ డ్రైవర్స్ ఆందోళన ఉధృత రూపం దాలుస్తొంది. ఆందోళన వల్ల ఆర్థికవ్యవస్థ దిగజారుతోందని కెనడా ప్రధాని పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఆయన విజ్ఞప్తుల్ని మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రసారం చేస్తోంది.
“కెనడియన్లకు నిరసన తెలిపే హక్కు, తమ ప్రభుత్వంతో విభేదించే హక్కు , తమ గళాన్ని వినిపించే హక్కు ఉంది. మేం ఎల్లప్పుడూ ఆ హక్కును రక్షిస్తాము. కానీ స్పష్టంగా చెపుతున్నా.. మన ఆర్థిక వ్యవస్థను, లేదా మన ప్రజాస్వామ్యాన్ని లేదా మన తోటి పౌరుల రోజువారీ జీవితాలను అడ్డుకునే హక్కు వారికి లేదు. ఇది ఆగాలి. పరిస్థితుల్ని అదుపు తెచ్చేందుకు మాకున్న వనరులతో మా పని చేస్తాం ” అని ఆ దేశ ప్రధాని అన్నారు. అంటే ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక చేసినట్టే.
అయితే ఆయనే భారత దేశంలో గతేడాది రైతు ఆందోళనలగురించి ఎలాంటి వైఖరి వ్యక్తం చేశారో అందరం చూశాం. ఆ సమయంలో ఇక్కడ రైతు ఆందోళనల సందర్భంగా భారత ప్రభుత్వం నిరసనకారులపై ఎలాంటి బలప్రయోగం చేయలేదు అదీ గమనించాం. అంతే కాదు రైతు చట్టాల్నే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు… రైతుల ఆందోళన ముసుగులో ఉన్న విధ్వంస శక్తులకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్, వాటర్ ట్యాంకర్స్, మొబైల్ టాయిలెట్స్, ఆహారం మొదలగునవి సప్లై చేశారు.. రాజ్యాంగ విధులకు విరుద్ధంగా.
కానీ ఇప్పుడు కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఓసారి చూద్దాం.
1. ఆ ఆందోళనకు మద్దతుగా జరుగుతున్న ఫండ్ రైజింగ్ వెబ్ సైట్లపై అమెరికాకు ఫిర్యాదు చేసి ఫండ్స్ కలెక్షన్ ఆపించింది
2. కెనడా రాజధాని ఒట్టవాలో ఎమర్జెన్సీ ప్రకటించింది
3. ఆందోళన కారులపై కఠిన చర్యలకు బలగాలను సమీకరిస్తోంది
4. మీడియా ద్వారా ప్రభుత్వ అనుకూల వార్తలు రాయించుకుంటోంది.
5. ఆందోళన కారులకు నీళ్ళు, ఆహారం, టాయిలెట్ పేపర్, నిధులు అందకుండా చర్యలు తీసుకుంటున్నాం అని పోలీసు అధికారులు చెప్పారు.
6. కొందరు వ్యక్తులు మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రజాస్వామ్యం మరియు మన తోటి పౌరుల రోజువారీ జీవితాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆగిపోవాలి అని ప్రధాని ఆందోళన కారులను హెచ్చరించాడు.
మన దేశంలో ఢిల్లీ రోడ్లు బ్లాక్ చేస్తూ కొద్ది మంది రైతులు చేసిన సమ్మెకు ఈ కెనడా ప్రధాని పూర్తి సంఘీ భావం తెలిపాడు. ఈయనతో పాటు బిబిసి, ఇంకా చాలా విదేశీ మీడియా కూడా ఆ ఆందోళన సమయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల వాదనను ప్రత్యేకంగా వినిపించింది. భారత్ ప్రభుత్వ విజ్ఞప్తులు, వాదనల్ని మాత్రం పట్టించుకోలేదు. వారి ఆందోళనల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో చెప్పే ప్రయత్నమే అస్సలు చేయలేదు.
కానీ ఇప్పుడు అదే విదేశీ మీడియా కెనడాలో ఈ రోడ్లు బ్లాక్ చేసే ఆందోళన వల్ల సామాన్య ప్రజలకు వచ్చే కష్టాలు, కెనడా దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం, ఈ ఆందోళన వర్ణ విబేధాల ఆందోళనగా మరే ప్రమాదం గురించి ఆందోళనకారులను పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి.
దీన్ని బట్టి విదేశీ మీడియా…స్వదేశంలోని ఓ వర్గం మీడియా ద్వంద్వ ప్రమాణాలు అర్థం చేసుకోవచ్చు. కొన్ని దశాబ్దాలు క్రితం వరకు తమకు బానిసగా వున్న భారత్ ఇప్పుడు పటిష్టంగా వుండడం వాటికి ఇష్టం ఉండక భారత్ ని అస్థిర పరిచే యెటువంటి శక్తులకు అయినా అవి నైతిక మద్దతు ఇస్తాయి. వాటిని తప్పు పట్టలేం. వాటిలో భారత్ పై వ్యతిరేకంగా వార్తలు వ్యాసాలు రాసేది కూడా భారతీయులే.
ఈ దేశంలో పుట్టి ఇక్కడ పరిస్థితులు తెలిసి కూడా తమకు ప్రస్తుత ప్రభుత్వంతో ఉన్న సైద్ధాంతిక విభేదాలు వల్ల అటువంటి దేశ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు తెలుపుతున్న దేశ మీడియా, మేధావులు ఇప్పుడు కెనడాలో జరుగుతున్న పరిణామాలను గమనించి రైతుల ఉద్యమ సమయంలో తమ పాత్రపై ఆలోచించుకోవాలి.
Courtesy :- Chada Shastry