తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కావడం లేదు. ఈ ఏడాది జనవరి నెలలోనే స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయింది. కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికప్పుడు స్పెషల్ అధికారులకు పాలనా పగ్గాలు అప్పగించి చేతులు దులుపుకొంది. రెగ్యులర్ పనుల్లో బిజీగా ఉంటే స్పెషల్ అధికారులు పంచాయతీల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో పల్లెల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
అనేక గ్రామపంచాయతీల్లో నిధుల కొరత వెంటాడుతుంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. ప్రజల నుంచి స్థానిక పనులు వసూలు కావడం లేదు. దీంతో పంచాయతీల పరిస్థితి దయనీయం గా ఉంది.
రాష్ట్ర నిధులు చాలా నెలలుగా ఆగిపోవడం, కేంద్రం నిధులు ఐదు నెలల నుండి మంజూరు కాకపోవడంతో సిబ్బందికి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి పంచాయతీలో ఏర్పడింది. కనీస పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి కూడా పైసలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ సిబ్బందికి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది .
పరిపాలన సౌలభ్యం కోసం గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించారు. ఎక్కడికి అక్కడ స్థానిక సంస్థలను విపరీతంగా పెంచేశారు. కానీ వీటి నిర్వహణకు నిధుల్లేక పంచాయతీల్లో పాలన మూలన పడుతోంది.
చాలా చోట్ల..
గ్రామపంచాయతీ సిబ్బందికి గత ఐదు, ఆరు నెలలుగా జీతాలు లేవు. నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీలకు కనీస నిధులు కూడా మంజూరు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీలో పనిచేయడానికి వెనకాడుతున్నారు. పంచాయతీలో చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందంటే పంచాయతీల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి.
వర్షాకాలం మొదలవుతున్న సమయంలో స్థానిక సంస్థల పని ఎక్కువగా ఉంటుంది. డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోతే రోగాలు దండెత్తుతాయి. అందుచేత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీలను ఆదుకోవాలని పల్లె జనం కోరుకుంటున్నారు