దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా పెట్రోల్,డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఏకంగా లీటర్ పెట్రోల్ ధర కొన్ని రాష్ట్రాల్లో రూ.100/- మార్కును దాటేసింది. అయితే కేంద్రం చొరవతో వీటి ధర తగ్గుతుందేమోనని ఇన్ని రోజులు అంతా వేచిచూశారు. మార్చి మధ్యలో ధరల నియంత్రణపై ఓ ప్రకటన వెలువడుతుందని అంతా ఆశగా ఎదురుచూస్తూ వచ్చారు. అయితే వారందరి ఆశలపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లుచల్లారు. ఇప్పట్లో ముడి చమురు, పెట్రోల్,డీజిల్, గ్యాస్ వంటి వాటిని జీఎస్టీలోకి తీసుకువచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఇప్పట్లో ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సహా సహజ వాయు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన లేదన్నారు. కాగా, వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పన్నులు తగ్గించేలా ఆలోచించుకోవాలని ఇటీవలే సూచించిన సంగతి తెలిసిందే.