ఈశాన్య ప్రాంతంలోనే ఎత్తైన 165 అడుగుల భారత జాతీయ పతాకాన్ని మణిపూర్లోని మొయిరాంగ్లోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) హెడ్క్వార్టర్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయనున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తెలిపారు.
మొయిరాంగ్లోని ఐఎన్ఏ అమరవీరుల స్మారక కాంప్లెక్స్ లో 78 వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అత్యంత ఎత్తైన జెండా కోసం ఇప్పటికే స్తంభాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాష్ట్రాన్ని సందర్శించి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అన్నారు.
1944, ఏప్రిల్ 14 తేదీన భారత గడ్డపై తొలిసారిగా ఐఎన్ఏ సుప్రీం కమాండర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గదర్శకత్వంలో లెఫ్టినెంట్ కల్నల్ షౌకత్ అలీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని..ఇది చారిత్రక దినమని గుర్తు చేశారు బీరెన్.
సుభాష్ బ్రిగేడ్ జపాన్ సైన్యంతో కలిసి 1944 ఏప్రిల్ ప్రారంభంలో మొయిరాంగ్ను స్వాధీనం చేసుకుని, భారతదేశంలో INA మొదటి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. బ్రిటీష్ సైన్యం నుంచి మొయిరాంగ్ను స్వాధీనం చేసుకునేందుకు INA చేసిన పోరాటంలో 96మంది మణిపూర్ వాసులు పాల్గొన్నట్టు తెలిపారు. వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ…. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొయిరాంగ్లో INA ప్రధాన కార్యాలయ కాంప్లెక్స్ నిర్మించామని …ఇంకా ప్రపంచ స్థాయి INA మెమోరియల్ పార్క్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)