ఆగ్రాలోని తాజ్మహల్ లో తాళం వేసి ఉన్న 22 గదులను తెరవాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థలం తమదేనంటున్నారు జైపూర్ రాజకుటుంబానికి చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి. ప్రస్తుతం తాజ్ మహల్ స్థలంలో రాజకుటుంబానికి ప్యాలెస్ ఉండేదని ఆమె అంటున్నారు. తాజ్ మహల్ లో మూసి ఉన్న గదులను తెరవాలంటూ దాఖలైన పిటిషన్ దాఖలవడాన్ని దియా స్వాగతించారు. ఇక నిజం బయటపడుతుందన్నారు. దీంతో పాటు తాజ్ మహల్ జైపూర్ పాత రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్ అని నిరూపించే పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆమె తెలిపారు. మొఘలులు ఆ స్థలాన్ని ఆక్రమించారని… అయితే ఆ సమయంలో మొఘల్ పాలన కారణంగా రాజకుటుంబం దీనిని వ్యతిరేకించలేకపోయిందని అంటున్నారు.
“తాజ్మహల్ను కూల్చివేయాలని నేను చెప్పను. కానీ అందులో మూసి ఉన్న గదులు తెరవాలి. దానిలోని కొన్ని భాగాలు చాలా కాలం పాటు సీలు చేసి ఉన్నాయి, వాటిని తనిఖీ చేయాలి. తద్వారా అక్కడ దాగి ఉన్న నిజం వెలుగులోకి వస్తుంది. దీన్ని సరిగ్గా తనిఖీ చేసినప్పుడు, అన్ని వాస్తవాలు బయటపడతాయి. ఇప్పుడు, ప్రభుత్వం ఏదైనా భూమిని స్వాధీనం చేసుకుంటే దానికి ప్రతిఫలంగా పరిహారం ఇస్తోంది. ఆ భూమికి షాజహాన్ ప్రతిఫలంగా కొంత పరిహారం ఇచ్చాడని నేను విన్నాను, కానీ ఆ సమయంలో అతనికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే చట్టం లేదు. కనీసం ఇప్పటికైనా ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేయడం విశేషం. భూమి మాది అని నేను అనడం లేదు. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మాకు అందుబాటులో ఉన్న ఏవైనా పత్రాలను అందించమని కోర్టు కోరితే.. మేం వాటిని పోతిఖానా (ప్యాలెస్లోని రికార్డ్ రూమ్) నుంచి అందిస్తాం. మా వద్ద ఉన్న పత్రాలలో, షాజహాన్ అప్పట్లో ప్యాలెస్ని ఇష్టపడ్డాడని.. అతను దానిని స్వాధీనం చేసుకున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. నేను ఇంకా అన్ని పత్రాలను చూడలేదు, కానీ ఆ ఆస్తి మా కుటుంబానికి చెందింది” అని దియా కుమారి అన్నారు.
2017లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. అప్పుడు ఈ భూమిని విక్రయించమని షాజహాన్ జైపూర్ మహారాజులను బలవంతం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. షాజహాన్ తాజ్ మహల్ భూమి ధరకు బదులుగా 40 గ్రామాలను పరిహారంగా ఇచ్చాడు” అని స్వామి అన్నారు.