ఒడిశా ప్రభుత్వం ‘పరిక్రమ ప్రకల్ప’ కింద పూరీ జగన్నాథ దేవాలయం మేఘనాద్ ప్రాకారం చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఒడిశా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాఖలు చేసిన పిల్లలో ఎటువంటి మెరిట్ లేదని, అటువంటి పిటిషన్లను దాఖలు చేయడం కోర్టు సమయాన్ని వృధా చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అభివృద్ధి పనులు ఆగిపోకుండా ఉండాలంటే ఇలాంటి పనికిమాలిన పిల్లను మొగ్గలోనే తుంచివేయాలని పేర్కొంది. పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది.ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందే లక్షలాది మంది భక్తుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. ప్రాజెక్ట్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, నిలిపివేయడం ద్వారా పిటిషనర్లు వ్యక్తిగత కీర్తిని ఆశిస్తున్నారని పేర్కొంది.
ఒడిశా ప్రభుత్వం 12వ శతాబ్దపు జగన్నాథ దేవాలయంలోని మేఘనాద్ గోడ చుట్టూ భక్తుల కోసం సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి, ప్రాంగణం సుందరీకరణకు సంబంధించిన నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగించవచ్చని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆలయం చుట్టూ తవ్వకాలు, నిర్మాణ కార్యకలాపాలను నిర్వహించకుండా ఆపలేమని హిమా కోహ్లీ, గవాయ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. జగన్నాథ ఆలయాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తుల ప్రయోజనాల కోసం బయటి ప్రాంతం చుట్టూ మరుగుదొడ్లు, ఫుట్పాత్లు సహా ఇతర సౌకర్యాలను నిర్మించాలనీ అంది.
రాష్ట్ర ప్రభుత్వం తవ్వకం పనులకు అవసరమైన అన్ని అనుమతులు పొందలేదని పిటిషనర్లు ఆరోపించారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సుప్రీం కోర్టు కేసులో ఒడిశా ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రా కూడా పూరీ సిట్టింగ్ ఎంపీ కావడం ఇక్కడ గమనార్హం. ఈ తీర్పును ‘ప్రభువు జగన్నాథుని సంకల్పం’గా ఆయన అభివర్ణించారు.
‘శ్రీమందిర పరిక్రమ ప్రకల్ప’ లేదా ‘పూరీ జగన్నాథ ఆలయ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్’ను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 2021, నవంబర్ లో ప్రారంభించారు. పూర్వపు ఒడిశా రాజు, పూరీకి చెందిన గజపతి మహారాజ్ ఈ ప్రాజెక్టుకు శిలాన్యాస క్రతువులను ఘనంగా నిర్వహించారు. హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ కింద ఆలయం చుట్టూ ఉన్న 75 మీటర్ల ప్రాంతంలో మొదట అన్ని ఆక్రమణలను తొలగించారు. రథయాత్ర ఉత్సవం కోసం శంకుస్థాపన చేసి వెడల్పు చేశారు. ఈ ప్రాజెక్ట్లో 12వ శతాబ్దపు ఆలయ గోడను రక్షించడానికి.. ఆలయాన్ని సందర్శించేటప్పుడు భక్తులకు పరిశుభ్రమైన, సురక్షితమైన స్థలాన్ని అందించడానికి బహుళ సౌకర్యాల అభివృద్ధిని చేస్తుంది.
ప్రభుత్వ ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ కు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పూరీని ప్రపంచ స్థాయి వారసత్వ నగరంగా మార్చడమే తన ధ్యేయమని సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.