లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్లో భారతీయ విద్యార్థులు శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. జై శివాజీ, జై భవానీ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. లండన్ లో లా చదువుతున్న సంగ్రామ్ షెవాలే అక్కడున్న భారతీయ విద్యార్థులందరితో కలిసి ఈ వేడుక నిర్వహించారు. క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, సోయాస్ విశ్వవిద్యాలయం ,లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీని స్మరించుకున్నారు. తెలుపు నారింజ రంగు కండువాలు ధరించిన విద్యార్థులు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాజీ 393 వ జయంతిని ఈ నేలమీద జరుపుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. భారత దేశం, చరిత్ర, విభిన్నమైన సంస్కృతులను అధ్యయనం చేయడానికి దేశదేశాలనుంచి భారత్ వస్తుంటారని.. అలాంటిది లండన్ పార్లమెంట్ స్క్వేర్ లో ఇక్కడివాళ్లకు తెలిసేలా హిందూ హృదయసామ్రాట్ శివాజీ జయంతిని జరుపుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నామని భారతీయ విద్యార్థులు తెలిపారు.