ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అఖిలభారతీయ సమన్వయ బైఠక్ ఈ సంవత్సరం కేరళలోని పాలక్కాడ్ లో జరగబోతోంది. ఆగస్టు 31 సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో మూడు రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ సమావేశాలు జరగటం ఆనవాయితీ.
ఇందులో సంఘ్ తో పాటు వివిధ క్షేత్రాల ప్రతినిధులు పాల్గొని ఏడాది మొత్తం జరిగిన కార్యక్రమాల్ని సమీక్షించుకుంటారు. అఖిల భారతీయ బైఠక్ సాధారణంగా సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తుంటారు. సెప్టెంబరు 2023లో మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించారు. అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్లో, వివిధ సంఘ్ ప్రేరేపిత సంస్థల ముఖ్య ఆఫీస్ బేరర్లు, ఆహ్వానితులు పాల్గొంటారు. ఈ సంస్థలన్నీ సామాజిక పరివర్తన కోసం నిర్మాణాత్మక కార్యకలాపాల ద్వారా సామాజిక జీవితంలోని వివిధ రంగాలలో ప్రజాస్వామ్య పద్ధతులతో చురుకుగా పనిచేస్తూ ఉంటాయి.
ఇప్పటికే సమావేశాలకు సంబంధించిన ఆహ్వానితుల వివరాలు నిర్ధారణయ్యాయి.
ఈ సమావేశంలో, సంఘ్ ప్రేరేపిత సంస్థల కార్యకర్తలు తమ సంబంధిత పని గురించి సమాచారాన్ని, అనుభవాలను వివరిస్తుంటారు. ఈ సమావేశంలో, ప్రస్తుత పరిస్థితులలో జాతీయ ఆసక్తి ఉన్న వివిధ అంశాలు, ఇటీవలి ముఖ్యమైన సంఘటనలు, సామాజిక మార్పుకు సంబంధించిన వివిధ కోణాలకు సంబంధించిన ప్రణాళికలపై చర్చ జరుగుతుంది.
ఈ సంస్థలన్నీ వివిధ విషయాలపై పరస్పర సహకారం, సమన్వయాన్ని పెంపొందించే చర్యల గురించి మాట్లాడుతాయి.
సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, మొత్తం ఆరుగురు సహ సర్ కార్యవాహలు, ఇతర సీనియర్ ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు.
రాష్ట్ర సేవికా సమితి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా పార్టీ, భారతీయ కిసాన్ సంఘ్, విద్యా భారతి, భారతీయ మజ్దూర్ సంఘ్, జాతీయ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, 32 సంఘ్ ప్రేరేపిత సంస్థలతో పాటు ముఖ్యమైన పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ప్రతిరోజు సమావేశ కేంద్రం దగ్గర నుంచి.. అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సమావేశాల వివరాలను వెల్లడిస్తుంటారు.