ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లోని జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు బాటలు వేస్తూ అభివృద్ధిలో కొత్త విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. 21వ శతాబ్దపు కొత్త నవభారతంలో అత్యుత్తమ ఆధునిక మౌలిక సదుపాయాలతో సర్వతోముఖాభివృద్ధి జరుగుతున్నదన్నారు.
మెరుగైన రోడ్లు, మెరుగైన రైలు కనెక్టివిటీతో పాటు విమానాశ్రయాల వంటి భారీ ప్రాజెక్టులు ప్రజా జీవితాలను మార్చివేస్తున్నాయన్నారు. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధిలో పరుగుపెడుతున్నాయని చెప్పుకొచ్చారు.
నోయిడాలో నిర్మించబోయే ఈ విమానాశ్రయం పశ్చిమ యూపీ ఆర్థిక స్థితిగతుల్ని మార్చివేస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన ఉపాధికల్పనతో పాటు ఆ ప్రాంతం నుంచి ఎగుమతులు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తర భారతదేశంలోని లాజిస్టిక్స్ గేట్వే అవుతుందని…. ఆప్రాంతం మొత్తం జాతీయ గతి-శక్తి మాస్టర్ ప్లాన్కు శక్తివంతమైన ప్రతిబింబంగా మారుస్తుందని మోదీ అన్నారు. ఇండిగ్రేటెడ్ మల్టీ మోడల్ కార్గో హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని కొత్త ప్రాజెక్టు నెరవేస్తుందని జోస్యం చెప్పారు.
గత ప్రభుత్వాలు యూపీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని మోదీ అన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం హయాంలో యూపీ అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతోందని…జాతీయ, అంతర్జాతీయంగానూ అన్నిరంగాల్లో గణనీయమైన ముద్ర కనిపిస్తోందనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
ఈ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ విమానాశ్రయం నిర్వహణతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం యోగీ అన్నారు. గత ఏడేళ్లలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం దేశవ్యాప్తంగా 62 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తోందన్నారు.