భారతీయ కుల లేదా వర్ణ వ్యవస్థ మీద గతంలో చాలా పుస్తకాలు వచ్చాయి. ఎక్కువగా ఈ పుస్తకాలు కులవ్యవస్థ లో లోటుపాట్లు గురించి, బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి గురించి వలస వాద రచయితలు రాసిన లేదా వక్రీకరించబడిన చరిత్ర గురించి మాత్రమే వివరించాయి తప్ప అసలు కులవ్యవస్థ సమాజంలో ఎలా వచ్చింది దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటీ అనే దాని మీద నిజాయితీ అయిన పరిశీలన జరగలేదు.
ఈ కులవ్యవస్థ ను పట్టుకుని హిందూ ధర్మం పై బురద జల్లదానికే ఈ రచనలు ప్రయత్నించాయి.
అయితే మొట్టమొదటి సారిగా భారతీయ కుల వ్యవస్థ గురించి భారతీయ ప్రాచీన రచనలను ఆధారం చేసుకుని ఒక తీవ్రమైన పరిశోధన చేసి “శివస్య కులం” అనే పుస్తకాన్ని శ్రీ మైలవరపు సుధామోహన్ మన ముందు ఉంచారు. నాలుగు సంవత్సరాలకు పైగా చిత్తశుద్ధితో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మైలవరపు సుధా మోహన్ వృత్తి పరంగా ఏవియేషన్ ప్రొఫెషనల్. కానీ అతని నిజమైన అభిరుచి హిందూమతం, దాని చరిత్ర పరిశోధనపై ఉంది. నేటి హిందూ సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై గతంలో అతను ఒక పుస్తకాన్ని సహా అనేక వ్యాసాలను రాశారు.
భారతీయ సమాజం మీద ఏ మాత్రం అవగాహన లేని బ్రిటిష్ వారు ఇక్కడ కుల వ్యవస్థను, అంటరానితనాన్ని తమకు అనుకూలమైన విధంగా ఎలా నిర్వచించారు, అసలు భారతీయ ప్రాచీన చరిత్రలో ఎక్కడా కనపడని ఉపకులాలను ఎలా సృష్ఠించారు అనేది చారిత్రక ఆధారాలతో బయట పెట్టారు.
అసలు ఈ కుల వ్యవస్థ తాంత్రిక ఆచారాలతో ముడి పడి ఉండేది అని ప్రస్తుతం చెప్పుకుంటున్న ఉన్నత నిమ్న కుల వర్గీకరణ 1870 కాలం వరకు లేదు అని, బ్రిటిష్ అధికారులు భావించారని, అప్పట్లో ఏ కులానికి ఆ కులమే ఉన్నతులుగా చెప్పుకునే వారు అని కూడా రచయిత పేర్కొన్నారు. ఈ కుల వ్యవస్థను అర్ధం చేసుకుందికి రచయిత ఇక్కడ ఆ కాలంలో కొన్ని కులాలు పాటించిన తాంత్రిక పద్ధతులను ఉపాసించే తెగల గురించి రాశారు. బ్రిటీష్ వారు ఒక పద్ధతి ప్రకారం తాంత్రిక ఉపాసన చేసే వారిని కించ పరచి ఎలా బలహీన పరిచారో వివరించారు.
అసలు హిందూ గ్రంధాలు నాలుగు వర్ణాలుగా పేర్కొంటే బ్రిటిష్ వారి హయాంలో ఐదవ వర్ణం వచ్చి చేరింది. నాలుగు వర్ణాలు బయటగా ఈ పంచమ కులాన్ని చూపించారు. కానీ హిందూ వాగ్మయంలో ఈ పంచమ వర్ణ ప్రస్తావన లేదు.
1871లో బ్రిటిష్ వారి జనాభా లెక్కల సమయంలో హిందూ సమాజాన్ని 5 కులలుగా విభజించారు అని బ్రిటీష్ అధికారి WR కార్నిష్ పేర్కొన్నారు. ఇప్పుడు చెప్పుకుంటున్న షెడ్యుల్ కాస్ట్ విభజన 4 వర్ణాలలో కాక వేరేగా చేసి 5వ వర్ణంగా పేర్కొన్నారు.
బ్రిటిష్ వారు ఆ తరువాత ద్రవిడ ఉద్యమ కారులు మన దేశ కుల వ్యవస్థకు వారికి అనుకూలమైన విధంగా రూపు ఇచ్చి దేశంలో అన్ని కుల రుగ్మతలకు బ్రాహ్మణులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
సుధామోహన్ గారి ఈ శివస్య కులం పుస్తకం చదివితే భారతీయ కుల వ్యవస్థ గురించి మనకు ఇప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. పై ఇజాల చట్రంలో ఇమిడి పోకుండా కాకుండా ఈ పుస్తకం పై విజ్ఞులు నిష్పక్షపాత వైఖరితో సమీక్షలు, చర్చలు జరిపితే ప్రజలు చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.
అందరూ తప్పక చదవండి. ప్రస్తుతం ఈ పుస్తకం ఇంగ్లీష్ భాషలో మాత్రమే లభ్యమౌతోంది. త్వరలో తెలుగు మరికొన్ని ప్రాంతీయ భాషల్లోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
~ Chada Sastry
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)