రాజకీయాల్లో ప్రతీ పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి. ఎన్నికలు వచ్చేనాటికి హామీలు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడం కోసం… నేతలు ఒకరిని మించి మరొకరు వాగ్దానాలు చేస్తుంటారు. ఒక్కోసారి అవతల పార్టీ హామీలనే వల్లె వేస్తుంటారు. రాజకీయాల్లో ఇది కొత్త కాదు. కానీ అవతలి పార్టీ పార్టీ మౌలిక సిద్ధాంతాలను కూడా… తాము ఆపాదించుకోవడం, తద్వారా ఓట్లు రాబట్టాలనుకోవడం…. తెలంగాణ రాజకీయాల్లో చూస్తున్నాం. ఇందుకు నిదర్శనం… తాజాగా రేవంత్ రెడ్డి ఇచ్చిన… రామాలయాల నిర్మాణ హామీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… తెలంగాణలో 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో… 10 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసి… రామాలయాలు నిర్మిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా… మంగళవారం భద్రాచలంలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ఈ హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. సరే… 119 నియోజకవర్గాలకు గాను… 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామాలయాలు నిర్మిస్తే… మిగతా 19 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి…? రామాలయాలకు… ఆ 19 నియోజకవర్గాలు నోచుకోవా…? ఇదెక్కడి అసంబద్ధ హామీ…!
అయోధ్య రామాలయ నిర్మాణం… వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తవుతుంది. ఈ అంశాన్ని బీజేపీ తప్పకుండా తమ ఎజెండాగా చూపెడుతుంది. రామాలయ నిర్మాణం ఘనత తమదేనని ప్రజల ముందుకు వెళ్తుంది. ఇదే సందర్భంలో యాదాద్రి ఆలయ నిర్మాణం, కొండగట్టు ఆలయ నిర్మాణ అభివృద్ధి ప్రణాళికను బీఆర్ఎస్ కూడా కచ్చితంగా ప్రస్తావించక మానదు. ఇదే నేపథ్యంలో మెజారిటీ హిందూ ఓట్లను కైవసం చేసుకునేందుకు… కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి రామాలయాల నిర్మాణ హామీని ఇచ్చినట్టు కనిపిస్తోంది. కానీ… గతానికి భిన్నంగా మత ప్రాతిపదికన కాంగ్రెస్ ఇచ్చే హామీలను ప్రజలు నమ్మే ప్రసక్తి ఎంత మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకమే.
ప్రత్యర్థి పార్టీ నిర్దేశించిన ఎజెండాలో దూరడం… అదే ఎజెండాను తాము ప్రస్తావించడం.. ఏ పార్టీకైనా నష్టదాయకమే. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎజెండానే అన్ని పార్టీలు ఎత్తుకున్నాయి. కానీ తెలంగాణ ఏర్పాటును ప్రజలు కేసీఆర్ ఘనతగానే చూశారు. ఆయనవైపే మొగ్గారు. ఇప్పుడు కూడా ఏనాడూ హిందుత్వం, రామాలయాల మాట ఎత్తని కాంగ్రెస్..ఇప్పుడు రామనామం జపిస్తోంది. దీనివల్ల కాంగ్రెస్ కు కొత్తగా లాభం ఉండకపోవచ్చనే చెప్పవచ్చు.
హాత్ సే హత్ జోడో యాత్రలో… పేదలకు ఇళ్ల నిర్మాణం, రైతుల సంక్షేమం వంటి అంశాలు రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా రామాలయ నిర్మాణ అంశం ప్రస్తావించడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నిజంగానే ఇది తెలంగాణకు మాత్రమే పరిమితమా…? జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్… దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తుందా….? మరి సెక్కులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్… ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ మతస్తులకు… ప్రార్థన ఆలయాలు నిర్మించి ఇస్తుందా…? కేవలం హిందువులకు మాత్రమే రామాలయాలు నిర్మిస్తే.. ఇక సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ కు… ఆ అర్హత ఉంటుందా..? బీజేపి మతతత్వ పార్టీ అని నిందించే నైతికత ఉంటుందా…? ఏ కోణంలో చూసుకున్నా… కాషాయ రంగు పులుముకుంటున్న కాంగ్రెస్ ది… చిత్తశుద్ధి లేని శివ పూజనే అవుతుంది.