అగ్రరాజ్యమైన అమెరికాకి చిరకాల మిత్రుడు ఇజ్రాయెల్ కి మధ్య వున్న సంబంధం కాలాలకు రాజకీయ మార్పులకు అతీతంగా ఎల్లకాలం నిలిచే దృఢమైన సంబంధం. ఎందుకంటే అమెరికాలో వున్న యాదులు చాలా ఆర్థికంగా సామాజికంగా చాలా బలమైన స్థితిలో వున్నవారు, వారిద్వారా ఇజ్రాయెల్ అమెరికా సంబంధాలు సుస్థిరంగా ఉండేలా ఇరుదేశాలు కృషి చేస్తాయి. డెమొక్రాట్ లేదా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఎవరు ఎన్నికయినా రెండు దేశాల సంబంధాలు మౌలికంగా మార్పులు చెందవు. ఈ మిత్రత్వం కొన్ని దశాబ్దాలుగా సాగుతూ వచ్చి పార్టీ రాజకీయాలకు అతీతంగా మారిన స్నేహం.
ఇక భారత అమెరికా సంబంధాల వరకు వస్తే, భారత్ తో అమెరికా వాణిజ్య సంబంధాలని గత రెండు దశాబ్దాలుగా భారత దేశం లో UPA లేదా NDA ప్రభుత్వం వున్నా, అమెరికాలో జార్జ్ బుష్ నాయకత్వం లోని రిపబ్లికన్ పార్టీ లేదా ఒబామా నాయకత్వం లోని డెమొక్రాట్ పార్టీ అయినా వ్యాపార వాణిజ్యాలని నిరాటంకంగా సాగించారు. నిజానికి గత రెండు సంవత్సరాలలో డోనాల్డ్ ట్రంప్ గారు పెట్టిన ఆంక్షలు మినహాయిస్తే భారత్ అమెరికా మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు రాజకీయాలకు అతీతంగా సాగుతున్నాయి. కాకపోతే గత 20 సంవత్సరాలలో భారత అమెరికాల మధ్య కొన్ని మార్పులు రక్షణ పరంగా జరిగాయి.
యాభై సంవత్సరాల పాటు భారత్ రష్యా వద్ద తమ రక్షణ కోసం పలు ఆయుధాల్ని విమానాలని కొనుగోలు చేసింది. ఇరుదేశాలలో రాజకీయ మార్పులకు అతీతంగా రష్యా భారత మిత్రత్వం రక్షణ విషయం లో సాగింది. అయితే భారత దేశం అమెరికా నుండి కొన్ని హెలికాప్టర్ లు, మిలిటరీ సరుకు రవాణా విమానాలు, శత్రు దేశాల విమానాల్ని పసిగట్టే రాడార్ సర్వియలన్సు చేసే పోసిడియన్ విమానాల్ని కొనటం ప్రారంభించింది. వాజపేయ్ గారి సమయంలో అణు ప్రయోగాలు చేసినప్పుడు భారత్ పై విరుచుకుపడిన అమెరికా కి తరువాత జార్జ్ బుష్ అదే అణు సామర్థ్యాన్ని విద్యుత్చక్తి ఉత్పత్తి కోసం భారత్ కి ఇచ్చిన అమెరికా మధ్య ఎంతో వ్యత్యాసం వుంది.
ఎదో “థర్డ్ వరల్డ్ కంట్రీ ” అని చిన్న చూపు చూసే రోజుల నుండి అమెరికా ఇప్పుడు స్వంతంగా అణు బాంబులను, క్షిపణులను , సాటిలైట్లను పంపే స్థాయికి వెళ్లిన భారత్ ని ఒక భావితరం శక్తి గా పరిగణిస్తుంది. అలాగే భారత అమెరికా రక్షణ సంబంధాలు రెండు దేశాలని మరింత దగ్గర చేసాయి. దీంట్లో భాగమే ఇటీవల సంతకం చేసుకున్న BECA ఒప్పందం. దీనివల్ల అమెరిగా అత్యంత రహస్యమైన సాటిలైట్ వీడియో లైవ్ ఫీడ్ ని భారత్ కు మిత్రదేశం కింద ఇస్తుంది. అమెరికా ఎప్పుడైతే రక్షణ విషయం లో ఒక దేశం తో దగ్గరవుతుందో అప్పటినుండి అమెరికా లోని రెండు ప్రధాన పార్టీలు కూడా ఆ దేశం తో తమ సంబంధాలని మార్చుకోదు. ఎందుకంటే అమెరికా రక్షణని వ్యాపారం తో కలిపి నిర్వహిస్తుంది. ఇలాంటి సంబంధాలు రాజకీయాలకు అతీతంగా సాగుతాయి.
ఈ నేపథ్యం లో అమెరికా లో జో బైడెన్ ఎన్నికవడం తో భారత్ పై కాశ్మీర్ విషయంలో వత్తిడి తీసుకొని రావడం వల్ల మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టవచ్చు అన్న విషయంలో నిజం వుందా ? ప్రస్తుతం చైనా భారత్ మధ్య జరిగిన సరిహద్దు వివాదం లో చైనా ను దీటుగా ఎదుర్కొని యుద్దానికి సమాయత్తమైంది భారత దేశం వల్ల అమెరికా కి ప్రయోజనం తప్ప నష్టం లేదు. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రం లో అమెరికన్ నౌక దళాన్ని ఎప్పటినుండో ఇబ్బంది లో పెడుతూ చిన్న దేశాలైన వియత్నాం, ఫిలిపైన్స్ పై దాదాగిరి చేస్తున్న చైనాని ఎదుర్కోవటానికి QUAD ఒప్పందాన్ని అమెరికా ఆధ్వర్యం లో భారత్, జపాన్ మరియు ఆస్ట్రేలియా లు ముఖ్య భాగస్వామ్యులు గా ఒప్పుకున్నాయి. ఒక్కసారి రక్షణరంగం లో మిత్రత్వం అయ్యాక డెమొక్రాట్ ప్రభుత్వమైనా రిపబ్లికన్ ప్రభుత్వమైనా పాలసీ పరిధిలో వ్యవహరిస్తాయి. కొత్త డెమొక్రట్ ప్రభుత్వం వల్ల భారత దేశానికి లాభం కానీ నష్టం కానీ, లేదా ప్రస్తుతం భారత దేశాన్ని పాలిస్తున్న భాజపా పార్టీకి అమెరికన్ డెమొక్రాట్ నాయకులతో సంబంధాలు క్షీణించడం కానీ జరుగవు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు భారత దేశానికి మిత్రుడు అంటూనే భారతీయుల్ని H 1 వీసా లు తీసుకొని రాకుండా చేసాడు. ఎందుకంటే వారి పాలసీ విధానాలు ఆలా రాసుకున్నారు.
ఇక చివరగా , ప్రధాని మోడీ కి ట్రంప్ తో చాలా మితృత్వం వున్నది అన్నది ఎంత నిజమో భారత అమెరికా సంబంధాలు వ్యక్తి గత స్థాయి నుంచి దేశ విధానాల స్థాయికి వెళ్లాయన్నది అంతే నిజం. వాడుక భాషలో చెప్పాలంటే BECA అగ్రిమెంట్ తరువాత భారత అమెరికాలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నాయి. చుట్టరికం ఖాయమైనట్లే. రెండిళ్లలో వచ్చిన మార్పుల మూలంగా సంబంధం ఆగిపోదు.
-భానుగౌడ