కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో భారతప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తులు పంకజ్ మిథల్, సంజయ్ కరొల్, పీవీ సంజయ్ కుమార్, ఎ.అమానుల్లా, మనోజ్ మిశ్రాలు ప్రమాణస్వీకారం చేశారు. వీరితో సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 32 కు చేరింది. హైకోర్టు జడ్జిల నుంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించేందుకు ఐదుగురు పేర్లను 2022 డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. జడ్జీల నియామకం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య విభేదాలు రావడంతో కాస్త జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 4న ఐదుగురు కొత్త జడ్జీల నియమాకాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. జస్టిస్ పంకజ్ మిథల్ రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉంటూ పదోన్నతి పొందగా, జస్టిస్ కరోల్ పాట్నా హైకోర్టు నుంచి, జస్టిస్ కుమార్ మణిపూర్ హైకోర్టు నుంచి, జస్టిస్ అమానుల్లా పాట్నా హైకోర్టు నుంచి, జస్టిస్ మిశ్రా అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.