
అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 25 పీసీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 ఏసీ స్థానాలకు 2,387 అభ్యర్థులు పోటీచేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిందని, పెద్ద ఎత్తులు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగానున్న మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలకు మొత్తం 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోఉన్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 13 న జరుగనున్న ఎన్నికల్లో ఈ అభ్యర్థులు పోటీ పడనున్నారన్నారు.
పీసీలకు సంబందించి 49 మంది అభ్యర్థులు మరియు ఏసీలకు సంబందించి 318 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పీసీలకు సంబంధించి మొత్తము 503 మంది అభ్యర్థులు, 175 ఏసీలకు సంబంధించి మొత్తము 2,705 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
పీసీలకు సంబంధించి అత్యధిక మొత్తంలో విశాఖ పార్లమెంటు స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీపడుతున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఏసీ స్థానాలకు సంబందించి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు తిరుపతి ఏసీలోను, అత్యల్పంగా 6 మంది అభ్యర్థులు చోడవరం ఏసీలోను పోటీపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని, ఇందుకు అంతా సహకరించాలని కోరారు.