గోదావరి జిల్లాల దగ్గర సముద్ర తీరానికి ఒక ప్రత్యేకత ఉంది. వందల కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. దీంతో అక్కడ సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సుడిగుండాల కారణంగా సముద్రపు నీరు… కెరటాల రూపంలో తీరాన్ని తాకుతూ ఉంటుంది. అప్పుడప్పుడు సముద్రం లోపలి పదార్థాలు ఒడ్డుకు వస్తూ ఉండడంతో ఆసక్తి పెరుగుతోంది.
ఈ క్రమంలో బంగారం నాణేలు ఒడ్డుకు వస్తున్నాయి అన్న పుకారు జోరందుకుంది.
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి జనాలు తండోప తండాలుగా తరలివస్తున్నారు.
భారీ వర్షాలు పడినప్పుడు అల్లా ఈ తాకిడి ఎక్కువగా ఉంటుంది. పోటు సమయంలో సముద్రం అల్లకల్లోంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఆ సమయంలో అలలు గట్టిగా వచ్చి తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ సమయంలో అలలతో పాటు ఇసుక, పలు రకాల సముద్ర జీవలు, ద్రవ, ఘన పదార్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.
పూర్వం కోటలు, పలు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయంలో బయటపడుతుంటాయన్నది వారి వెర్షన్.
గతంలో తుఫాను వచ్చినప్పుడు కోనపాపపేట తీరం ఒడ్డున ఇసుకలో పురాతన సిల్వర్ కాయిన్స్ దొరికాయి. ఉప్పాడ తీరంలోని మంగళ దిబ్బ ప్రాంతంలో పలుమార్లు బంగారం లభ్యం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అల్పపీడనాలు, తుఫాన్లు సంభవించిన సమయాల్లో కెరటాలు తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందని.. సముద్రంలో కలిసిపోయిన బంగారు వస్తువుల ముక్కలు ఒడ్డుకు కొట్టుకువస్తాయని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాను కారణంగా ఉప్పాడ తీరంలోకి బంగారు రేణువులు కొట్టుకొచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మత్స్యకారులు, స్థానికులు గత రెండు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రం అక్కడే వెతుకులాట కొనసాగిస్తున్నారు.
మొత్తం మీద ఉప్పాడ తీరం అంతా బంగారం కోసం జనంతో కిటకటలాడుతోంది.