పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో దొరికిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం నగలు తనవి కాదని, తాను లేనప్పుడు ఎవరో తన ఫ్లాట్లలో పెట్టి ఉంటారని ఆమె ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న అర్పితను ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళుతున్నప్పుడు ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఇంటిని మినీ బ్యాంక్లా మంత్రి వాడుకున్నారని, డబ్బు దాచిన గదిలోకి తొంగి కూడా చూడకుండా తనను కట్టడి చేశారని వాపోయారు. శాంతినికేతన్లో 2012లో 20 లక్షలకు కొనుగోలు చేసిన ఫామ్ హౌస్ను పార్థా చటర్జీ అర్పితకు రాసిచ్చేశారు. ఇది ఈడీ దాడుల్లో వెలుగులోకివచ్చింది. ఈ ఫామ్హౌస్కు అపా అని పేరు పెట్టారు. అ అంటే అర్పిత, పా అంటే పార్థా చటర్జీ అని అర్థం వచ్చేలా పేరు పెట్టారు.
మరోవైపు ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. అయితే తనను ఈ కేసులో ఇరికించారని పార్థా ఛటర్జీ అంటున్నారు. అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన డబ్బులు తనవి కాదని.. సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతానని ఆయన పేర్కొన్నారు.