దేశంలోని ప్రధాన దేవాలయాలు ఇప్పుడు కోవిడ్ సెంటర్లుగామారిపోయాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేలాదిమంది రోగులు ఇప్పుడు ఆలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా విజృంభిస్తున్న వేళ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలు కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నాయి.
గుజరాత్ వడోదరాలోని స్వామి నారాయణ్ ఆలయం తమ యజ్ఞపురుష్ మందిరాన్ని కోవిడ్ సెంటర్ గా మార్చేసింది. 500 పడకలు ఏర్పాటు చేయడం తో పాటు…ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. ఐసీయూ గదులు, వెంటిలేటర్లను రోగుల కోసం సిద్ధం చేసింది.
ఏప్రిల్ 13నుంచి అన్ని సౌకర్యాలతో కోవిడ్ రోగులకు అందుబాటులో వచ్చింది. ఇప్పటివరకు 45 మంది కోవిడ్ పేషెంట్లు సమీప ఆస్పత్రులనుంచి వచ్చి చికిత్స తీసుకుని కోలుకున్నారు.
ఫ్యాన్లు, కూలర్లు, ఐసీయూ గదులు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు అన్నీ ఉన్నాయక్కడ. ప్రస్తుతం అక్కడ 300 బెడ్లు ఉండగా..మరో 200 బెడ్ల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక ఒరిస్సాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ మందిరానికి చెందిన నీలాచల్ భక్త నివాస్ ను కోవిడ్ సెంటర్ గా మార్చాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. 120 పడకలతో ఇతర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిఅందుబాటులోకి తేనున్నారు. అంతేకాదు కోటీ 50 లక్షల రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్ పండ్ కు అందచేసింది టెంపుల్ ట్రస్ట్. కేవలం పూరి ఆలయం మాత్రమే కాదు ఒడిశాలోని 62 ఇతర ఆలయాలు సీఎంఆర్ఎఫ్ కు విరాళాలిచ్చాయి.
ముంబైలోని కందివాలిలోని పవన్ ధామ్ ఆలయం తన నాలుగంతస్తుల భవనాన్ని 100 పడకలతో కూడిన కోవిడ్ సెంటర్ గా మార్చేసింది. 50 పడకలకు ఆక్సిజన్,ఆక్సిమీటర్లు, పల్స్ మీటర్లు, బీపీ మిషన్లు, మానిటర్ మిషన్లు సిద్ధం చేశారు. మొత్తం 50 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గతేడాది కూడా ఈ ఆలయం కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేసి 2 వేల మంది రోగులకు చికిత్స అందించారు.
ఇక హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ లోని విశ్వనాథాలయం కోవిడ్ పేషెంట్లకు నిరంతర అన్నవితరణ చేస్తోంది.
గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలోని ప్రసిద్ధి సారంగ్ పూర్ హనుమాన్ మందిరం కూడా దాని ధర్మశాలను 100 పడకల ఆస్పత్రిగా మార్చింది.
ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్ మందిరాన్ని కోవిడ్ సెంటర్ గా మార్చిన విషయం తెలిసిందే.
జైపూర్లోని రాధాస్వామి సత్సంగ్ సెంటర్ ప్రాంగణంలో 5 వందల పడకల కోవిడ్ కేర్ ఆస్పత్రి సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 25నుంచి అందుబాటులోకి రానుంది. అయితే 8 వేల పడకలకు సరిపడా విశాలంగా ఉంటుందది. దశల వారీగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముంబైలోని రెండు జైన మందిరాలు కోవిడ్ సెంటర్లుగా మారిపోయాయి. పవిత్ర గ్రంథాలను , డొనేషన్ బాక్స్ వంటి వాటిని చుట్టచుట్టి పక్కనపెట్టి అక్కడ బెడ్లు వేశారు. రోజూ జైనులు వచ్చి ధ్యానం చేసుకునే ఆ మందిరం ఇప్పుడు ఎక్స్ రే మిషన్లు, పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, ఇతర మిషన్లతో నిండిపోయింది.
గతేడాదినుంచీ కరోనాపై పోరుకు ఎన్నో హిందూ ఆలయాల సహకరిస్తూవస్తున్నాయి. కోట్లాదిగా విరాళాలు ఇవ్వడంతో పాటు పేదలకు ఆహారం అందిస్తూ..ఆశ్రయం కల్పిస్తున్నాయి.