ఉత్తరప్రదేశ్ నేరాలకు నిలయం. దశాబ్దాలుగా గూండాలు, డాన్స్ అక్కడ రాజ్యం ఏలుతున్నారు. వాళ్లలో ప్రముఖులు రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు అవుతూ ఉంటే రెండో తరగతి గూండాలు వార్డు మెంబెర్స్, కార్పొరేటర్లు గా అధికారం చలాయిస్తున్నారు. వీళ్లు చట్టం అంటే భయం లేకుండా ప్రైవేట్, ప్రభుత్వ భూముల కబ్జాలు, బెదిరింపులు గూండా గిరి, దాదాగిరి, ధనికుల కిడ్నాపింగ్ ఇలా మొత్తం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అన్ని జిల్లాల్లోనూ పాగా వేశారు. ఆయా ప్రదేశాల్లో వీరు చెప్పేదే వేదం, వీరు అమలు చేసేదే శిక్ష.
పేరుకే పోలీసు వ్యవస్థ. వీరిపై ఏ ఆరోపణలు వచ్చినా రాజకీయ జోక్యం వల్ల వీరిపై ఏ కఠినమైన చర్యలు తీసుకోలేరు. తప్పని సరి పరిస్థితుల్లో కేసులు నమోదు చేసినా తూతూమంత్రంగా విచారణ చేసి నిర్దోషులగా విడిచిపెట్టేస్తారు.
ముఖ్యంగా సమాజవాదీ పార్టీ, బీఎస్పీ పార్టీల పాలనా కాలంలో ఆ పార్టీకి చెందిన గూండాలపై ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన గూండాలపై చర్యలు తీసుకునే వారు తప్ప యుపి ప్రజలకు వీళ్ళ పీడ శాశ్వతంగా తొలిగిపోయే కఠిన చర్యలు తీసుకునే సాహసం చెయ్యలేదు ఆ రెండు పార్టీలు రాజకీయ అవసరాల దృష్ట్యా.
అయితే ఈ గూండాల ఖర్మ కాలి 2017లో యోగి యుపి ముఖ్యమంత్రి గా వచ్చారు. వచ్చి రాగానే యూపీలో శాంతి భద్రత లపై దృష్టి సారించారు. గూండాలు అందరిని తమంతా తాముగా వచ్చి పోలీసులకు లొంగి పొమ్మని వార్నింగ్ ఇచ్చారు. మొండికేసిన వాళ్ళు కొందరు ఎన్కౌంటర్ లలో పోవడం తో చాలా మంది మధ్యరకం గూండాలు తమంతట తామే వచ్చి పోలీసులకు లొంగిపోయారు, కొందరు యుపి వదలి పారిపోయారు. ఇక పెద్ద పెద్ద గ్యాంగ్ స్టర్ ల కబ్జా ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, ఆ ఆస్తులు నేల మట్టం చెయ్యడం, ప్రభుత్వ ఆస్తుల కబ్జాల పై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టారు.
యోగి వచ్చిన 2 సం.లలోపే అంటే 2019 డిసెంబర్ కి సుమారు 5000 పైగా పోలీసు దాడుల్లో 100 మందికి పైగా ఎన్కౌంటర్స్ లో పోతే సుమారు 1900 మంది గాయపడగా సుమారు 1800 మంది తమ బెయిల్స్ రద్దు చేసుకొని పోలీసులకు లొంగిపోయారు.
యోగి ప్రభుత్వం రాజకీయ పార్టీలతో సంబంధం, కులం, మతం చూడకుండా అందరి గూండాలపై పోలీసు దాడులు చేయించారు. ఆ దాడుల్లో బాగా పలుకుబడి గల పెద్ద గూండాలు వికాస్ దూబే వంటి వారు కూడా పోయారు.
ఇటువంటి ఒక పెద్ద గూండాయే ముక్తార్ అన్సారీ.
ఈ అన్సారీ ఎవరో అనామకుడు కాదు. మన మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి స్వయానా మేనల్లుడు.
ఈయన 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు. ప్రస్తుతం బిఎస్పీ ఎమ్మెల్యే. ఇతని మీద యూపీలో వివిధ పొలీస్ స్టేషన్లలో 52 కేసులు ఉన్నాయి. విచారణ జరుగుతూ ఉంది. ఇతన్ని యూపీలో బందా అనే జైలులో ఉంచారు.
అయితే సినిమాల్లో విలన్ ని జైల్ నుండి తప్పించే తరహాలో 2019 జనవరిలో పంజాబ్ లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి 10 కోట్లు ఇమ్మన్నారు అని అన్సారీ ఆ కాల్ చెయ్యమన్నాడు అని బెదిరింపు కాల్ చేసిన వాడు చెప్పడంతో పంజాబ్ పోలీసులు అన్సారీ పై కేసు నమోదు చేసి వారెంట్ తీసుకువెళ్లి అన్సారీని బందా జైల్ నుండి పంజాబ్ తీసుకువచ్చి రోపర్ అనే జైల్లో ఉంచి సర్వ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలహాబాద్ హై కోర్ట్ అనుమతి లేకుండా బందా జైలర్ అన్సారీ ని పంజాబ్ పోలీసులకు అప్పగించడంతో ఆ జైలర్ ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది యుపి ప్రభుత్వం.
అంతేకాక అన్సారీ పై యూపీలో బోల్డు కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి యూపీలో విచారించడానికి వీలుగా అన్సారీ ని యూపీకి సరెండర్ చెయ్యమని పంజాబ్ ప్రభుత్వాన్ని యుపి ప్రభుత్వం కోరితే అన్సారీకి షుగర్, నడుం నొప్పి వల్ల ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి మేం సరెండర్ చెయ్యం అని పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది.
దాంతో యుపి ప్రభుత్వం సుప్రీంకోర్టు కు పోయి మొరపెట్టుకుంది ఒక చిన్న కేస్ సాకుగా చూపించి కనీసం ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యకుండా 2 సం.ల నుండి అన్సారీని పంజాబ్ ప్రభుత్వం కాపాడుతోంది మాకు అన్సారీ ని సరెండర్ చెయ్యాలని ఉత్తర్వులు ఇమ్మని వేడుకుంది. సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టి నిన్న అంటే ఏప్రిల్ 8లోగా యూపీ ప్రభుత్వానికి అన్సారీని సరెండర్ చెయ్యమని ఆదేశాలు ఇచ్చింది.
ఇంతకూ అన్సారీ యూపీ రావడానికి భయం ఎందుకు? 2005లో ఒక బిజెపి ఎమ్మెల్యే హత్య కేస్ లో అన్సారీ అతని ముఖ్య అనుచరుడు నిందితులు. ఆ మధ్య పోలీస్ దాడుల్లో ఆ ముఖ్య అనుచరుడు పోయాడు. దాంతో యుపి రావడానికి అన్సారీ గజ గజ వణుకుతున్నాడు. అంతే కాక యుపి ప్రభుత్వం అన్సారీ దౌర్జ్యంగా కట్టిన 200 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకొని నేల మట్టం చేసింది.
దీనితో భయపడ్డ అన్సారీ భార్య మా ఆయన్ను యుపి పోలీసులు లేపేయ్యకుండా రక్షించండి అని రాష్ట్రపతికి మొరపెట్టుకుంది. ఆంతే కాక సుప్రీంకోర్టు లో కూడా కేస్ వేసింది.
నిన్న యుపి పోలీసులు అన్సారీని యుపి తీసుకువచ్చి మళ్ళీ బందా జైల్లో పడేసారు.
చట్టం తన పని తను చేసుకుపోదు, చేయించాలి. చట్టం అంటే భయం పుట్టాలి. సరిగ్గా యోగి చేస్తున్నది అదే!
మరి కాంగ్రెస్ ? తాము ఒక పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే నేరస్తులను ఇలా రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు టెర్రరిస్టులను కోర్టుల్లో వెనకేసుకు రావడం, నక్సల్ సానుభూతి పరులను కేంద్ర అడ్వైజరీ బోర్డుల్లో మెంబర్స్ గా వెయ్యడం.
మరి దేశంలో లా అండ్ ఆర్డర్ బాగుపడడం లేదు అంటే ఎలా బాగుపడుతుంది?
….చాడా శాస్త్రి.