స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైనిక బలగాలలో అత్యంత సాహసం ప్రదర్శించిన అధికారులకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తెలుగు వాడైన ఆర్మీ మేజర్ మల్లం రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఉగ్రవాదులతో పోరాటంలో భాగంగా అత్యంత సాహసం ప్రదర్శించి ప్రాణాలను పణంగా పెట్టి ఆయన పోరాడారు. దీనిని గుర్తించిన సైనిక బలగాల ఉన్నతాధికారులు రామ్ గోపాల్ నాయుడుకు కీర్తిచక్ర సిఫార్సు చేశారు.
వాస్తవానికి జీవించి ఉండగా ఇంతటి అత్యున్నత పురస్కారం అందుకోవడం అరుదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్ గోపాల నాయుడుకి ఈ గౌరవం దక్కుతోంది. ఆయన ప్రస్తుతం మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ, 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్గా పనిచేస్తున్నారు. వాస్తవానికి సైనిక బలగాలను అనేకమంది శ్రీకాకుళం జిల్లా వాసులు పనిచేస్తూ ఉంటారు. కానీ ఎక్కువమంది జవాన్ కేటగిరీలో సేవలు అందిస్తూ ఉంటారు. సైన్యం కోసం అహర్నిశలు శ్రమించిన రామ్ గోపాల్ నాయుడు అంచలంచలుగా ఎదిగి మేజర్ స్థాయికి చేరుకున్నారు.
గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా ఆయన సాహసం ప్రదర్శించారు. అక్టోబరు 26న జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించారు. వెంటనే వారిపై సైనికులు దాడి చేశారు. వీరికి రాంగోపాల్ నాయకత్వం వహించారు. ఒక టెర్రరిస్ట్ను రాంగోపాల్ హతమార్చారు. మరొక ఉగ్రవాదిని గాయపర్చారు. తన దళానికి ప్రమాదాన్ని గుర్తించి అత్యంత సాహసంతో, ప్రాణాలకు తెగించి మరో ఉగ్రవాదిని అగ్నితో కాల్చివేశారు. అదే సమయంలో గుహలో దాక్కున్న మరో ఉగ్రవాదిని మట్టుబెట్టేందుకు రాంగోపాల్ ప్రాణాలను లెక్కచేయకుండా అటు వైపు వేగంగా పరుగెత్తారు. కానీ, తీవ్రవాది ఆయనపై గ్రెనేడ్లు విసిరాడు. అయినా సరే వెరవకుండా, వాటి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంటూ ఉగ్రవాదిని బంధించారు. సైనికుల ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టడం, క్లినికల్ ఆపరేషన్ను ప్లాన్ చేయడం, ఆ ప్లాన్ను అమలు చేయడం వంటి గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించినందుకు గాను రాంగోపాల్ను కీర్తిచక్ర అవార్డుకు ఆర్మీ ఉన్నతాధికారులు సిఫారసు చేశారు.
ఈ ఏడాది కీర్తిచక్ర అవార్డుకు నలుగురు ఎంపిక కాగా, అందులో రాంగోపాల్ ఒకరు. సజీవంగా ఉంటూ ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి రామ్గోపాల్ కావడం విశేషం. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు దేశంలో 496 మంది సైనికులు కీర్తి చక్ర అవార్డులకు ఎంపికయ్యారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో రామ్గోపాల్ తొలి వ్యక్తి కావడం విశేషం. ఈయనది సంతబొమ్మాళి మండలం, నగిరిపెంట గ్రామం. తండ్రి అప్పలనాయుడు టీచర్, తల్లి హేమలత గృహిణి. రాంగోపాల్ కోరుకొండ సైనిక్ స్కూల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఏన్డీఏకు ఎంపికయ్యారు. అతను కీర్తిచక్ర అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్రానికే గర్వకారణం. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా రాంగోపాల్నాయుడు ఈ అవార్డును అందుకొన్నారు.
రాంగోపాల్ నాయుడు కి కీర్తి చక్ర దక్కటం పట్ల శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.