కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ రాజస్థాన్లో రాజుకున్న నిప్పు ఇప్పట్లో చల్లారేలా లేదు. అధ్యక్ష రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్ తీరుతో పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. పార్టీ చీఫ్ పదవి సంగతి తరువాత ఉన్న సీఎం పోస్టు ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ముందున్న ఆయన ఢిల్లీకి వెళ్లినా సొంత రాష్ట్రంలోనూ పట్టుకోసం పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆయన మద్దతుదారులు 93మంది రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను చెప్పిన వాళ్లనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఆయన పట్టుబడుతున్నారు.
ఆయనా పట్టుబడుతోంది సచిన్ పైలట్ ను అడ్డుకునేందుకు మాత్రమే. అసలైతే యువనాయకుడైన పైలట్ ను సీఎం చేయాలని పార్టీ అనుకుంది.గత ఎన్నికల సందర్భంగానే పైలట్ పేరు వినిపించినా సీనియర్ అయిన గెహ్లాట్ వైపు మొగ్గుచూపింది అధిష్టానం. ఇప్పుడిక గెహ్లాట్ పార్టీ సారథిగా వెళ్తే ఆ అవకాశం సచిన్ కు ఇవ్వాలనుకుంది. అయితే ఆయన్నిగట్టిగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ బెట్టు చేస్తున్నారు. పరిశీలకులుగా వచ్చిన అజయ్ మాకెన్ను, మల్లికార్జున కు అదే స్పష్టంచేశారు. దీంతో వాళ్లని పార్టీ డిల్లీకి పిలచింది. అటు సచిన్ పైలట్ సైతం ఢిల్లీ వెళ్లారు. సోనియా సహా సీనియర్లతో చర్చిస్తున్నారు. ఈ వ్యవహారంలో గెహ్లాట్ తీరు హైకమాండ్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ కాకుండా ఇతర పేర్లను పరిశీలించడం మొదలుపెట్టింది. కమల్నాథ్ను ఇప్పటికే ఢిల్లీకి పిలిచారు. శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. దిగ్విజయ్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. పవన్ బన్సల్, ముఖుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది.