2026 కల్లా దేశంలో తొలిబుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. గుజరాత్ సూరత్ లో జరుగుతున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులను కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. 2026లో సూరత్, బిలిమోరా మధ్య మొదటి బుల్లెట్ రైలును నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పనుల ప్రోగ్రెస్ చాలా బాగుందని అనుకున్న సమయానికి బుల్లెట్ ట్రైన్ కదులుతుందని ఆయన అన్నారు.
బిలిమోర దక్షిణ గుజరాత్లోని నవ్సారి జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఈ మార్గంలో పిల్లర్ కాస్టింగ్ పనులు 61 కి.మీలకు పైగా ఉన్నాయి. మొత్తం 150 కి.మీ పొడవునా పనులు జరుగుతున్నాయి. భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలను అందించడానికి వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని అధికారులు తెలిపారు.
గుజరాత్, మహారాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీలో విస్తరించి ఉన్న అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం అవసరమైన మొత్తం భూమిలో 90 శాతానికి పైగా సేకరించామని ప్రాజెక్ట్ అమలు చేసే ఏజెన్సీ NHSRCL తెలిపింది.
ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో ఎక్కువ భాగం గుజరాత్లో ఉంది. 954.28 హెక్టార్లలో విస్తరించి అహ్మదాబాద్, వల్సాద్, నవ్సారి, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్ సహా ఖేడా జిల్లాలను కవర్ చేస్తోంది. మహారాష్ట్రలో ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో 71.49 శాతం సేకరించామని NHSRCL తెలిపింది. అంతేకాకుండా దాద్రా, నగర్ హవేలీని కవర్ చేయడానికి అవసరమైన మొత్తం భూమిని కూడా సేకరించారు.
ప్రతిష్టాత్మకమైన అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు 2017 సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే శంకుస్థాపన చేశారు.