తెలంగాణ రాజకీయాలనుంచి గులాబీ పార్టీని ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు అన్న చర్చ బలంగా నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బలంగా పట్టు బిగించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ లో హస్తం పార్టీని పటిష్టం చేసినట్లయితే రాజకీయాల్లో
ఎదురు ఉండదని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు విస్తారంగా ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి చేరికలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తెచ్చేసినట్లయితే.. ఆయా నియోజకవర్గాల్లోని క్యాడర్ ఖాళీ అవుతుందని భావిస్తున్నారు. ప్రాంతాలవారీగా చేరికల బాధ్యతను కొంతమందికి రేవంత్ రెడ్డి అప్పగించారు. ఆయా నాయకులు పాత పరిచయాలు బయటకి తీసి గులాబీ నేతలతో సంప్రదింపులు జరుపుకున్నారు.
జంట నగరాల్లో గులాబీ నేతలను ఆకర్షించే బాధ్యతను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అప్పగించారు. సుదీర్ఘకాలం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న దానంకు .. సిటీ లోని గులాబీ నాయకులతో బాగా సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన అనేకమందిని పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని, కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదని చెప్పారు. ఒకవేళ దొరికినా… గంటల తరబడి వెయిట్ చేయించేవారు అని దానం నాగేందర్ గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది అని, అందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు అని దానం చెప్తున్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే లను పురుగుల్లా చూసేవారని, అందుకే విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. గతం లో కాంగ్రెస్ హయాంలో తమకు స్పెషల్ డవలప్మెంట్ ఫండ్ ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదు అని దానం వివరించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారు అని,
వాటి వివరాలు త్వరలో బయట పెడతాను అని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో కేటీఆర్ బినామిలు వేల కోట్లు దండుకున్నారని, త్వరలో సాక్షాలతో బయటపెడుతా అని నాగేందర్ సవాల్ విసురుతున్నారు.
మొత్తం మీద దానం నాగేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ పార్టీని పూర్తిగా ఖాళీ చేయించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది అని అర్థమవుతోంది. మరోవైపు ఇదంతా ఒక మైండ్ గేమ్ అన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో ఉండాలా,, వెళ్లిపోవాలా అన్న అనుమానం చెందుతున్న ఎమ్మెల్యేలు ట్రాప్ చేసి కాంగ్రెస్ లో లాగేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని తెలుస్తోంది. మొత్తం మీద జంపింగ్ వ్యవహారాలు.. అసెంబ్లీ సమావేశాల లోగా ఒక కొలిక్కి వస్తాయి అని అర్థం చేసుకోవచ్చు.