ఉన్నావో దళిత బాలికలపై ఏం జరిగింది..? పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందేంటి..?
యూపీలోని ఉన్నవో పట్టణ సమీపంలో దళిత బాలికల మృతి సంచలనంగా మారింది. బుధవారం నాడు ఉన్నావో పట్టణం సమీపంలో పశువులకు మేత కోసం పొలం వెళ్లారు. అయితే రాత్రి అయినప్పటికీ వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, సోదరుడు పోలం వైపు వెళ్లారు. దీంతో అక్కడ వారంతా అపస్మారక స్థితితో కన్పించారు. వారిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు వాహనం తీసుకొచ్చే లోపే అందులో ఇద్దరు బాలికలు మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న మరో బాలికను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిని దుప్పట్లో కట్టిపడేసినట్లు సంఘటనా స్థలంలో ఉండటంతో మిస్టరీగా మారింది. చనిపోయిన ఇద్దరు బాలికల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
మృతిచెందిన బాలికలపై విష ప్రయోగం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అంతేకాదు వారిని దుప్పట్లో కట్టివేసినట్లు కూడా తెలుస్తోంది. చనిపోయిన ఇద్దరు విష ప్రయోగం ద్వారానే మృతిచెందినట్లు వైద్యులు నివేదికలో ధృవీకరించారు. అయితే ఎలాంటి విషం అన్నది తెలియరాలేదు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. దళిత బాలికల మృతితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హథ్రస్ ఘటన రాజకీయ దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు. కుటుంబ సభ్యులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సోదరుడు తెల్పిన వివరాల ప్రకారం.. ముగ్గురు బాలికలు చదువు మానేశారని.. ఇంటి దగ్గరే ఉంటూ పనులు చేసుకుంటున్నారని వెల్లడించాడు. తమకు ఎవరితో కూడా శత్రుత్వం లేదని.. పశువులకు గడ్డి కోసం తమ పొలంలోకే వెళ్తారని తెలిపాడు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాలతో దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు ఉన్నావో ఎస్పీ వెల్లడించారు. కాగా, ఘటనపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను దాచిపెట్టారంటూ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై పోలీసులు ఫైర్ అయ్యారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నామన్నారు. అనంతరం వారు ఇంటికి వెళ్లారని.. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక వద్దకు వెళ్లారని వివరించారు.