తెలంగాణ విమోచనకు 75 ఏళ్లు. నిరంకుశ నిజాం మెడలు వంచి స్వతంత్ర భారతంలో తెలంగాణ విలీనం అయింది. బందూకులు పట్టిన వెట్టి బతుకులు నిజాంపై పోరుకు తొడగొట్టాయి. వేలాదిమంది బలిదానాల ఫలితంగా తెలంగాణ స్వేచ్ఛను హత్తుకుంది. ప్రపంచ చరిత్రలోనే అదొక అపూర్వ ఘట్టం.
1947లో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని దేశమంతా పండగచేసుకుంటున్న వేళ…తెలంగాణ ప్రాంతంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం. రజాకార్ల పాశవిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరోజు ఎర్రకోటపై బ్రిటీష్ జెండాను దించి…త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తే… హైదరాబాద్ సంస్థానంలో మాత్రం కోటీ అరవైలక్షలమంది ప్రజల పరిస్థితిమాత్రం అగమ్యగోచరం. హైదరాబాద్ సంస్థానాన్ని భారతయూనియన్లో కలపబోనంటూ నిజాం నవాబు చేసిన ప్రకటనతో తెలంగాణ అట్టుడికిపోయింది. ఎక్కడికక్కడే ప్రజలనుంచి వస్తున్న నిరసనను రజాకార్ల సైన్యం అంతే తీవ్రంగా ప్రతిఘటించింది. ఎక్కడికక్కడ ఉద్యమకారులను అణచివేస్తూ…రాజ్యాన్ని పూర్తిగా దిగ్బంధించింది. అయినా నిజాం తుపాకులు, ఫిరంగులు వెల్లువలా వచ్చే జనజాతరను కట్టడిచేయలేకపోయాయి. అప్పటికే రజాకార్ల పేరుతో నిజాం సైన్యం ఖాసింరజ్వీ నేతృత్వంలో సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు దేశమంతటికీ స్వరాజ్యం వచ్చినా నిజాం ఉక్కుపాదం కిందనే తెలంగాణం ఉండడం వాళ్లు తట్టుకోలేకపోయారు. అప్పటికే ఎన్నో దౌర్జన్యాల్ని భరించిన ప్రజలకు ఓపిక నశించింది. అందుకే తెగబడ్డారు. అందుకే నిరంకుశపాలనపై యుద్ధంప్రకటించారు.
అసలైతే భారతస్వాతంత్ర్య సంగ్రామానికి ముందే నిజాం ప్రజలు సర్కారు వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వామి రామానందతీర్థ హయాంలో స్టేట్ కాంగ్రెస్, రావినారాయణరెడ్డి నేతృత్వంలో కమ్యూనిస్ట్ లు, పండిట్ నరేంద్రజీ , వందేమాతరం రాంచంద్రరావు నాయకత్వంలో ఆర్యసమాజ్ సంస్థలు నిజాం విముక్తి పోరాటాన్ని సాగించాయి. 1946 వరకు ఈ పోరాటాలన్నీ గాంధేయ మార్గంలోనే జరిగాయి. నిజాం సైన్యాన్ని నిరాయుధులైన ప్రజలు వడిసెల రాళ్లతో ఎదిరించేవారు. ఎక్కడికక్కడ రజాకార్లను తరిమికొడుతూ వచ్చారు. రజాకార్ల ముసుగులో నిజాం సైన్యం ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుంది.ఆ కాలంలోఅమరులైన సామాన్యులెందరో. నాటి పోరులో అమరుల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. తెలంగాణలోని అనేక ప్రాంతాలు. రక్తచరిత్రను తలపించే నిజాం విమోచనోద్యమం యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది.
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, గోండులపై సాగే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొమరం భీం ఉద్యమించాడు. అటు విసునూర్ దేశ్ముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా తొలిసారి బందగీ అనే సామాన్య రైతు సాగించిన పోరాటం ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. క్రమంగా సంస్థానంలోని చాలా ప్రాంతాల్లో ప్రజాచైతన్యం వెల్లువెత్తింది. తెలంగాణ సాయుధ పోరాటంలో.. పోరుగడ్డ ఓరుగల్లు పాత్ర మరువలేనిది. ఖిల్లావరంగల్లో రజాకార్ల ఆగడాలకు బత్తిని మొగిలయ్య బలయ్యారు. విమోచనోద్యమంలో మొగిలయ్యది తొలిహత్య అని చెప్పవచ్చు. ఇక పరకాల యోధులది వీరోచిత పోరాటం. జాతీయ పతాకం ఎగురవేసేందుకు వచ్చిన ప్రజలపై నిజాం సైనికులు తుపాకులు ఎక్కుపెట్టి మరో జలియన్ వాలాబాగ్ ను తలపించారు. 23 మందిని బలిదీసుకున్నారు. వందలాదిమంది గాయపడ్డారు. జనగామ పరిధిలో బైరాన్పల్లి .. రజాకార్లకు సింహస్వప్నంగా నిలిచింది. మద్దూరు, సలాక్పూర్, లద్నూర్లోని మహిళలపై రజాకార్లు అత్యాచారాలకు పాల్పడ్డారు. ఆయా గ్రామాల్లో ముస్లిం మహిళలనూ వాళ్లు వదల్లేదు. వారిని బైరాన్ పల్లి వాసులు వీరోచితంగా ఎదుర్కొన్నారు. గ్రామం బొడ్రాయి దగ్గరున్న బురుజుపై గ్రామరక్షకదళం నగారా ఏర్పాటుచేసుకుంది. రజాకార్లు గ్రామంలోకి అడుగుపెట్టగానే .. ప్రజలందరినీ మెల్కొలిపి వారిని తరిమికొట్టారు. దీంతో పగబట్టిన రజాకార్లు పలుసార్లు బైరాన్పల్లిపై దాడులకు తెగబడి 25 మందిని అతికిరాతకంగా కాల్చి చంపారు. ఆ మారణకాండకు సజీవ సాక్ష్యంగా నిలిచిన వాళ్లు ఒకరిద్దరు ఉన్నారుకూడా.
నిజాం రజాకార్ల ఆగడాలను, గడీల దౌర్జన్యాలను ఎదుర్కొని పోరాడటంలో దేవరుప్పుల మండలం కడవెండి అగ్రభాగాన నిలిచిందని చెప్పొచ్చు. ఆ గ్రామానికి చెందినవాడే దొడ్డి కొమురయ్య. కడివెండితో పాటు దేవరుప్పుల, కోలుకొండ, గ్రామాల్లో దాదాపు 40 మంది విముక్తి పోరాటంలో అసువులు బాసారు. వారిని స్మరించుకునేందుకు కామారెడ్డి గూడెంలో బందగీ స్థూపాన్ని నిర్మించారు. జాతీయజెండా ఎగురవేశారని నెపంతో ఎర్రగొల్ల పహాడ్పై దాడికి తెగబడ్డ రజాకార్లు ఐలయ్య, చాకలి కొమురయ్యతో పాటు మరో 11 మందిని కిరాతంగా కాల్చివేశారు. ఇక మహబూబాబాద్ డివిజన్లో పెరుమాళ్ల సంకీసలో సాయుధపోరాటం గుర్తులు ఇంకా ఉన్నాయి. పాలకుర్తిలో తొలి మహిళా తిరుగుబాటుదారుగా చాకలి అయిలమ్మ చరిత్రలో నిలిచింది.
తెలంగాణ విమోచనం కోసం కవులు, కళాకారులు తమ పోరాటం సాగించారు. నాటి మీడియా కూడా కీలక పాత్ర పోషించింది.
బందగీ.. షోయాబుల్లా ఖాన్ త్యాగాలు… రెసిడెన్సీలో ప్రాణాలు అర్పించిన తుర్రెబాజ్ ఖాన్. ఒకరేంటీ యావత్ తెలంగాణ ఏకమై… దశాబ్దాలపాటు జనాన్ని నంజుకు తిన్న నిజామును తరిమితరిమి కొట్టారు. మఖ్దూం మొయినుద్దీన్, దాశరథి, కాళోజి.. హీరాలాల్ మోరియాలు గీతాలతో జనాలను ఉత్తేజపరిచారు. ఓ చేత్తో గన్ను, మరో చేత్తో పెన్నుపట్టిన వాళ్లూ ఉన్నారు. యాదగిరి, తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హనుమంతు, అలువాల మాచయ్య, ఆవుల పిచ్చయ్య వంటి వాళ్లెందరో తమ పాటలతో ప్రజాపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ఖిల్లా వరంగల్ సమీపంలోని ఖుష్ మహల్ కూడా ఈ నెత్తుటి చరిత్రకు సజీవసాక్ష్యమే. ఈ ప్రాంగణంలో 1946లో జరిగిన పంచమార్య సాహిత్య సమ్మేళనం రజాకార్ల దాడితో రక్తపుటేరులైంది. మూడురోజుల పాటు జరిగిన ఈ సభలకు వినాయకరావు విద్యాలంకార్ అధ్యక్షత వహించారు. చివరిరోజున నరేంద్రజీ ఆగమనంతో వరంగల్ వీధులు పిక్కటిల్లాయి. ఆనాటి శౌర్యప్రతాపాలను చూసి ప్రజాకవి కాళోజీ .. కుక్కలు మొరగవు, నక్కలు కూయవు.. కారణమా.. మా నరేంద్ర సింగము గర్జించునులే ఈనాడు.. ! అంటూ గళమెత్తారు. తరతరాల బూజు నిజాం రాజు అంటూ గళమెత్తి గర్జించిన ఓరుగల్లు సింహం దాశరథి తన గళంలో, కలంలో నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ప్రకటించారు. కోటిరతనాలవీణగా తెలంగాణను కీర్తించాడు. సామాన్యుడు సైతం ఉద్యమించేలా బండియాదగిరి రాసిన బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి అన్న పాట నేటికీ మారుమోగుతూనే ఉంటుంది.
నిజాం సంస్థాన విమోచనోద్యమంలో నాటి పత్రికలు కీలకపాత్ర పోషించాయి. వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలోని ఇనుగుర్తికి చెందిన ఒద్దిరాజు సోదరులు తెనుగు పత్రికతో జాతీయవాదాన్ని, నిజాం వ్యతిరేకధోరణిని ప్రదర్శించారు. సురవరం ప్రతాపరెడ్డి తన గోలకొండ పత్రికలో హైదరాబాద్ సంస్థాన విమోచన వార్తను గోలకొండ పత్రికలో బ్యానర్ గా ప్రకటిస్తూ.. మొత్తం భారతావని స్వాతంత్ర్యం సాధించిందని పేర్కొన్నారు. ఆంధ్రసారస్వత పరిషత్, హిందీ ప్రచార సభలు ప్రజల్లో మాతృ, జాతీయ భాషపట్ల మక్కువ పెంచేలా చేశాయి.
నిజాం నిరంకుశ ధోరణికి, దొరలు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరులో సుమారు పది లక్ష ఎకరాల భూమి ప్రజాపరమైంది. మహిళలు కూడా ఆయుధాలు చేపట్టి పోరుబాట పట్టడం గొప్ప విషయం.