తాను పార్టీ వీడుతున్నానన్న ప్రచారాన్ని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. పార్టీలు మారే సంస్కృతి, అమ్ముడుపోయే నైజం తనదికాదన్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ చీల్చినప్పుడే తాను వెళ్లలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీనే తనను గెంటేసిందన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో పొగిడినంత మాత్రాన తాను పొంగిపోనని… ఈటల అంత సులభంగా మోసపౌడని ఆయన వ్యాఖ్యానించారు. తనకంటూ ఓ నిబద్ధత, నీతీ ఉన్నాయన్న ఆయన… ఏ పార్టీలో ఉన్నా సైనికుడిలా పనిచేయడమే తనకు తెలుసన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు, వారి తరపున కొట్లాడేందుకే అసెంబ్లీకి వచ్చానని వ్యక్తిగత విషయాలు మాట్లాడ్డానికి కాదనీ అన్నారు. టీఆర్ఎస్ విధానాలపైనా ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మీద అక్కసు తప్ప ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధేలేదన్నారు. కరోనా అన్ని ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థల్ని అల్లకల్లోలం చేస్తే… మోదీ విధానాలవల్లే భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకున్నదని ఈటల అన్నారు. పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి స్పష్టత ఇచ్చారు.
పార్టీ మారే సంస్కతి నాది కాదు, నాకంటూ నీతీ నిబద్ధతా ఉన్నాయి : ఈటల రాజేందర్
Share: