కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.8 శాతంగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా రిపోరేటు, రివర్స్రిపో రేటులో ఎటువంటి మార్పు లేదన్నారు. పద్నాలుగవ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం సందర్భంగా ఆయనీవిషయాలు వెల్లడంచారు. డిజిటల్ రూపీని రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రీ పెయిడ్ వోచర్లుగా ఆర్బీఐ జారీ చేస్తుందని, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. పప్పులు, వంట నూనె ధరల్లో ఉత్పత్తి పెరిగినందున ధరల పెరుగుదలకు కళ్లెం పడినట్లేనని చెప్పుకొచ్చారు.
గత నవంబరు నుంచి పెట్రోలు ధరలు పెంచకపోవడం వల్ల ధరల పెరుగుదలకు కొంత బ్రేక్ పడిందని పేర్కొన్నారు. ఓమిక్రాన్ ప్రభావం క్యూ 3, క్యూ 4పై పెద్దగా లేదని…2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం అవుతుందని తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో ద్రవోల్బణం 5.7 శాతంగా ఉందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల అదుపులోకి వస్తుండటంతో ద్రవ్యోల్బణం తగ్గుతోందని శక్తికాంత్ దాస్ వివరించారు. వాణిజ్య బ్యాంకుల పనితీరు మెరుగుపడుతోందని చెప్పారు.