విధుల్లో ఉన్న పోలీసునే దుర్భాషలాడి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు ఓ కార్పొరేటర్. సమయం ముగిసిందని దుకాణం మూయాలని పోలీసులు చెబుతుంటే అక్కడికి వచ్చి మరీ గొడవపడ్డాడు హైదరాబాద్ బోలక్ పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్. నిబంధనల మేరకు అర్థరాత్రి 12 దాటిన తరువాత దుకాణాలు ఉండవద్దని షాప్ ఓనర్లతో పోలీసులు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి రచ్చ చేశాడా ప్రజాప్రతినిధి. డ్యూటీలో ఉన్న పోలీసులను బెదిరించాడు. అభ్యంతకరమైన భాషలో తిడ్తుండగా ఎవరో రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పెద్ద దుమారమే రేగింది.
ఇది రంజాన్. ఇది మా ఏరియా. మీ బెదిరింపులకు భయపడం. అసలు మా ఏరియాకు మీరెలా వచ్చారు. వచ్చేనెల 1 వరకు ఇటువైపు మీరు రావద్దు. ఇదే మా హెచ్చరిక అంటూ పోలీసులపై అరుస్తూ మీదకెళ్లబోయాడు గౌస్. అంతేకాదు వంద రూపాయల మనిషివి నువ్వు అంటూ ఓ కానిస్టేబుల్ ను తీవ్రంగా అవమానించాడు.
ఈ వీడియో మీడియాలోనూ, సోషల్మీడియాలో తెగ వైరల్ అయ్యాక కానీ పోలీసులు పట్టించుకోలేదు. సదరు ప్రజాప్రతినిధి క్షమాపణ చెప్పాడని సర్దిచెప్పబోయారు. అయితే సోషల్మీడియాలో చర్చ జరుగుతుండడంతో మంత్రి కేటీఆర్ స్పందించాల్సి వచ్చింది. డ్యూటీలో ఉన్న పోలీసులను అడ్డుకున్న ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ ద్వారా పోలీసులను కోరాడు. దీంతో పోలీసులకూ తప్పలేదు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇంత జరిగితే హోంమంత్రి కనీసం స్పందించలేదని…కేటీఆర్ చెప్తే మాత్రమే చర్యకు దిగారని నెటిజన్లు మండిపడుతున్నారు.
దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ గట్టిగానే స్పందించారు. రాబోయే 30 రోజుల పాటు ఆ ఏరియాలోకి రావద్దనడం, విధుల్లో ఉన్న పోలీసులను తిట్టడమేం పద్ధతి. నగర పోలీసులందరికీ ఇదో హెచ్చరిక. ఓ వర్గానికి మితిమీరిన స్వేచ్ఛ ఇస్తే ఇలాగే అవుతుంది. కానీ వాళ్లపై చర్యలు తీసుకుంటామని అనుకోలేం అని ట్వీట్ చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)