కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో చావులు. భర్తను పోగొట్టుకున్న భార్య …కళ్లముందే కడుపునపుట్టిన బిడ్డలు కన్నుమూస్తున్నారు. కొన్నిచోట్ల కుటుంబసభ్యులందరి మరణశాసనం రాస్తోంది మాయదారి కరోనా . ప్రాణాలకు తెగించి రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లూ చనిపోతున్నారు.
ప్రస్తతం దేశంలో కోవిడ్ విలయాన్ని కళ్లారా చూస్తున్న..నిత్యం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న దయనీయ స్థితి గురించి చెప్తూ జాగ్రత్తగా ఉండండంటూ ముంబైకి చెందిన ఓ యువ డాక్టర్ ఏడుస్తూ మాట్లాడిన మాటలు విన్నాం. ‘ఏడాదిగా ఏం చేయలేదు మేం సూపర్ హీరోలం..మాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది అనుకోకండి…వినండి మాస్కులు పెట్టుకోండి. దూరం పాటించండి’ అని వేడుకుంటూ చెప్పారు.
మహారాష్ట్ర సెవ్రీలోని టీబీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనీషా జాధవ్ చనిపోయే కొన్ని గంటల ముందు ఎఫ్బీలో పెట్టిన పోస్టు అందర్నీ కదిలించింది. “ఇది నా ఆఖరి గుడ్ మాణింగ్ కావచ్చు. నేను మళ్లీ మిమ్మల్ని చూడలేకపోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండండి. మరణం శరీరానికే, ఆత్మకు కాదు. ఆత్మకు చావు లేదు” ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.
మీకు ఏం కాదంటూ చాలామంది కామెంట్ల రూపంలో ధైర్యం చెప్పారు. కానీ ఆమె చనిపోయింది.
డిల్లీలో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న శాండ్రా సెబాస్టియన్ తనకెదురైన అనుభవాలను షేర్ చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘కొద్దిరోజుల క్రితం 22 ఏళ్ల యువకుడు కరోనాతో ఆస్పత్రికి వచ్చాడు. వెంటనే ఎమర్జెన్సీకి తరలించాం. ఇక బతకడం కష్టమే అనిపించింది. ఆ తల్లిదండ్రుల ఆరాటం చూడాలి. ఎన్ని ప్రశ్నలు వేశారు..ఏం ఆహారం ఇవ్వాలి. ఏ దేవున్ని వేడుకోవాలి అంటూ. కానీ నాలుగురోజులకే అతను చనిపోయాడు. చేతికందొచ్చిన కొడుకు విగతజీవిగా మారడం చూసిన ఆ కన్నవాళ్ల ఆర్తనాదాలు ఇప్పటికీ మరిచిపోలేకున్నా…’
‘ఇక రెండు వారాల క్రితం మరో ఘటన…ఓ తల్లి చివరి మాటలు నా హృదయాన్ని మెలిపెట్టాయి. నాకు 11 ఏళ్లు, నాలుగేళ్ల పిల్లలున్నారు. నేను వారికోసం బతకాలి అంటూ ఐసీయూలోకి వెళ్తూ ఆ తల్లి ఎంతో ఆరాటపడింది. కానీ కాసేపటికే కన్నుమూసింది. చిన్నారులకు తల్లిని తనివితీరా పట్టుకుని ఏడిచే అవకాశం కూడా లేకుండా పోయింది. మా అమ్మని ఒక్కసారి హగ్ చేసుకుంటాం అని ఆ పిల్లలు ఏడుస్తుంటే నాకు గుండె పగిలినంత పనైంది. ఈ చావులన్నీ చూస్తుంటే పుట్టకపోయినా బాగుండేది అని అనిపించింది’ అన్నారాడాక్టర్..
డాక్టర్లే కావచ్చు కానీ వాళ్లూ మనుషులే కదా..కరోనా మహమ్మారి సాగిస్తున్న విలయాన్ని వాళ్లు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కళ్లముందే జనం పిట్టల్లా రాలుతుంటే తట్టుకోలేకపోతున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉందాం. అవసరమైతే తప్ప బయటకు రాకండి… వస్తే మాస్కులు ధరించండి. దూరం పాటించండి. ఏమాత్రం లక్షణాలు కనిపించినా డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తూ ఐసోలేషన్ లోకి వెళ్లిపోండి. కరోనాకు అడ్డుకట్ట వేయడం, కట్టడి చేయడం అంటే మనం జాగ్రత్తగా ఉండడమే .