దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం సంచలన విషయాలు బయట పెట్టింది. దేశంలో 2వేల 800 కు పైగా రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయని వెల్లడించింది. ఇందులో చాలా పార్టీలు ఏమాత్రం పనిచేయటం లేదని, కేవలం ఎన్నికల సమయంలో అక్రమాల కోసం ఉపయోగించుకొంటారని వెల్లడించింది. ఈ వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి.
….
మన దేశంలో పార్టీల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఇందుకోసం పార్టీలు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయా పార్టీలకు పోలయ్యే ఓట్లను బట్టి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు లభిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు జాతీయ పార్టీలుగా, బీఆర్ఎస్, తెలుగుదేశం, వైసీపీ వంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు తెచ్చుకొన్నాయి. ఇటువంటి పార్టీలు దేశమంతటా కలిపి వందా, నూట యాభైకి మించి ఉండవు. ఈ పార్టీలన్నీ సహజంగానే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజాస్వామ్యంలో పాలు పంచుకొంటూ ఉంటాయి.
…
ఇవి కాకుండా కేవలం ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకొని, తర్వాత బ్యాగ్ సర్దేసిన పార్టీలు చాలానే ఉంటాయి. ఇప్పుడు ఈ పార్టీలతోనే అసలైన తలనొప్పి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పార్టీలకు ఎన్నికల సందర్బంగా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ఆ సమయంలో చాలా గిమ్మిక్కులు బయట పడతాయి. ఉదాహరణకు, కొంత కాలం క్రితం తెలంగాణ లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోకవర్గం మహేశ్వరంలో పోటీ చేశారు. అప్పట్లో కారు గుర్తు మీద బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ పడ్డారు. అదేపేరు గల మరో అభ్యర్థికి ట్రాక్టర్ గుర్తు ఇప్పించటంతో ఆయనకు వేల సంఖ్యలో ఓట్లు పోలై, చివరకు గులాబీ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. మొన్నటికి మొన్న చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ పడగా, అదే పేరు గల ఒకాయన్ని తీసుకొని వచ్చి బీఎస్పీ పార్టీ తరపున నిలబెట్టారు. ఆయనకు కూడా వేల సంఖ్యలో ఓట్లు పోలై పోయాయి. కొద్ది పాటి మెజార్టీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బయట పడ్డారు..
…..
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరిన్ని విచిత్రాలు చేస్తూ ఉంటారు. ఆయన పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్. దాదాపుగా వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ను పోలి ఉంటుంది. చాలా సార్లు వైసీపీ అభ్యర్థి పేరు మాదిరి పేరుగలిగిన వ్యక్తులే ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తూ ఉంటారు. ఇద్దరి పేర్లు ఒకటే ఉండటం, ఫ్యాన్ రెక్కలు మరియు హెలికాప్టర్ రెక్కలు ఒకే మాదిరిగా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురి అవుతుంటారు. పైగా కే ఏ పాల్ కూడా క్రైస్తవ ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటారు.
..
ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన పార్టీలకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి.
1) రిజర్వ్డ్ పార్టీ చిహ్నం:
ఒక గుర్తింపు పొందిన పార్టీకి దాని అధికారిక అభ్యర్థులు మాత్రమే ఉపయోగించగల ప్రత్యేక చిహ్నం కేటాయిస్తారు. ఇది ఎన్నికల సమయంలో వారికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. దీని ఆధారంగా పెద్ద ఎత్తున మోసాలు జరిగిపోతున్నాయి.
2) ఉచిత ప్రసార సమయం:
సాధారణ ఎన్నికల సమయంలో వారికి ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) మరియు దూరదర్శన్ వంటి ప్రజా ప్రసార కేంద్రాలలో ప్రత్యేక ప్రసార స్లాట్లు మంజూరు చేస్తారు. ప్రచారం విషయంలో కూడా కొన్ని ప్రాతిపదికలు కల్పిస్తారు. వీటి ఆధారంగా చాలా సౌకర్యాలు పొందుతారు.
3) నామినేషన్ల కోసం తగ్గించబడిన ప్రతిపాదకులు:
స్వతంత్ర అభ్యర్థులతో పోలిస్తే గుర్తింపు పొందిన పార్టీలకు వారి అభ్యర్థుల నామినేషన్ పత్రాల కోసం తక్కువ మంది ప్రతిపాదకులు సరిపోతారు. ఇతర మినహాయింపులు కూడా ఉంటాయి.
4) ఉచిత ఎన్నికల జాబితాలు:
గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు రెండు సెట్ల ఓటర్ల జాబితాను ఉచితంగా అందిస్తారు.
5) ఎన్నికలలో సంప్రదింపులు:
ఎన్నికల తేదీలను నిర్ణయించడం మరియు ఎన్నికల నియమాలను రూపొందించడం వంటి వివిధ ఎన్నికల సంబంధిత విషయాలపై భారత ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలను సంప్రదిస్తుంది.
6) స్టార్ క్యాంపెయినర్లు:
ఎక్కువ సంఖ్యలో నాయకులను స్టార్ క్యాంపెయినర్లుగా నామినేట్ చేయవచ్చు మరియు పార్టీ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ఈ ప్రచారకులు ప్రయాణానికి చేసే ఖర్చు అభ్యర్థి వ్యక్తిగత వ్యయ పరిమితుల నుండి మినహాయిస్తారు. ఈ వంకతో అనేకమందిని ప్రత్యర్థి పార్టీ మీద విమర్శల కోసం ఉపయోగించుకోవచ్చు.
……
కేంద్ర ఎన్నికల సంఘం లోతుగా దర్యాప్తు చేశాక అనేక విషయాలు బయట పడ్డాయి. దేశంలో వందల సంఖ్యలో రాజకీయ పార్టీలు… ఈ ముసుగులో వ్యాపారం చేసుకొంటున్నాయి. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడేందుకు కోట్ల రూపాయలు దండుకొంటున్నట్లు లెక్కతేలింది. దీంతో ఈ రంగంలో ప్రక్షాళన చేయాలని ఈసీ నిర్ణయించింది.
…..
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని భారత ఎన్నికల కమిషన్ … ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు మరియు డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి కసరత్తుని ముమ్మరం చేసింది. అయిదు సంవత్సరాలుగా ఎటువంటి రాజకీయ ప్రక్రియ ను చేపట్టని పార్టీల పేర్లను సేకరించింది. దేశవ్యాప్తంగా 345 పార్టీలను ఈ జాబితా నుంచి తొలగించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.
ఈ పార్టీలు 2019 నుండి లోక్సభ, రాష్ట్ర శాసనసభలు లేదా ఉప ఎన్నికలలో పోటీ చేయలేదు లేదా వాటి కార్యాలయాలు భౌతికంగా ఎక్కడా ఉండటం లేదు కూడా.
……
భారతదేశంలో ప్రస్తుతం 2,800 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు రిజస్టర్లు అయి కనిపిస్తున్నాయి. వాటిలో చాలా వరకు అక్రమాల కోసం రిజిస్టర్ చేయించుకొన్న పార్టీలుగా అనుమానిస్తున్నారు. అందుచేత ఆయా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులు .. ఈ పార్టీలకు షో-కాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు, తద్వారా వారు ఏదైనా తుది నిర్ణయం తీసుకునే ముందు స్పందించడానికి మరియు విచారణలకు హాజరు కావడానికి అవకాశం కల్పిస్తారు. లేనిపక్షంలో ఈ పార్టీల గుర్తింపును రద్దుచేయాలని భావిస్తున్నారు.
..
మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఎన్నికల ప్రక్రియలో ప్రక్షాళన చేపట్టారు. ఇప్పటి దాకా ఈ ముసుగులో ఎన్ని అక్రమాలు జరిగిపోయాయో దేవుడికే తెలియాలి.