దేశంలో అరుదైన వ్యాధుల బారినపడిన రోగులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధిగ్రస్తులు ఆర్ధిక సాయం కోసం చేసుకొనే దరఖాస్తులను వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని దేశంలోని 8 ప్రముఖ హాస్పిటళ్లను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. రోగులకు ట్రీట్మెంట్ కోసం కేంద్రం ఒక్కొక్కరికి 50 లక్షల వరకు అందించనుంది. కేంద్రం ఈ నగదును నేరుగా రోగికి ఇవ్వదు. ట్రీట్మెంట్ ఖర్చు 50 లక్షలకు మించితే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నగదు సేకరణకు వెబ్ సైట్(https://raredeseases.nhp.gov.in)ను ఏర్పాటు చేసింది. అరుదైన వ్యాధులకు ట్రీట్మెంట్ అందించేందుకు ఎంపిక చేసిన 8 సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ లకు ఏకకాల మద్దతు కింద 5 కోట్ల చొప్పున నిధులను అందించనుంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 8 హాస్పిటళ్లలో ఢిల్లీ ఎయిమ్స్ తోపాటు హైదరాబాద్ లోని నిజాం హాస్పిటల్ కూడా ఉంది.