మరో భారీ స్కాం వెలుగుచూసింది. రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసిన నిందితులను సీబీఐ పట్టుకుంది. ముగ్గురు నిందితులు కూడా 100 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది. రాకెట్ ప్రధాన సూత్రధారులు కమలాకర్ బండ్గర్, రవీంద్ర విఠల్ నాయక్, మహేంద్రపాల్ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నమరొకరి కోసం గాలిస్తున్నారు. వాళ్లు ముగ్గురూ మహారాష్ట్ర, కర్నాటక, డిల్లీకి చెందినవారని తెలిసింది.
ఇంకా పలు నామినేటెడ్ పోస్టులు సైతం ఇప్పిస్తామని… మంత్రిత్వశాఖల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు సైతం ఇప్పిస్తామని మోసం చేసినట్టు సీబీఐ గుర్తించింది.
వారంతా తమను తాము సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుని ఈ మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. వారంతా ప్రభుత్వ శాఖల్లో ఉండే ఉన్నతాధికారులతో మాట్లాడుతూ నమ్మకం కలిగిస్తూ పదవికోసం ఆశపడుతున్న కోటీశ్వరులైన వారికి వలేసేవారని తెలిసింది. పలువురిని దాదాపు 100 కోట్లకు పైగా ముంచిన వ్యవహారం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే రాజ్యసభ స్థానాలు, గవర్నర్ పదవుల కోసం వారికి కోట్లకు కోట్లు ఇచ్చిన ఆశావహులు ఎవరనేదానిపైనా ఆరా తీస్తోంది సీబీఐ.