ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సందడి మొదలయ్యింది. గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతం లో కళ తగ్గింది అని చెప్పుకోవాలి. వైసిపి ప్రభుత్వం హయాంలో అమరావతి ఇమేజ్ ను బద్దలు కొట్టేందుకు విపరీతంగా ప్రయత్నాలు జరిగాయి. దీంతో అక్కడ కార్యకలాపాలు మొదలు పెట్టాల్సిన సంస్థలు వెనక్కి వెళ్ళిపోయాయి.
కానీ ఇప్పుడూ తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో సందడి ఊపందుకొంది . అప్పట్లో వాగ్దానం చేసిన సంస్థల్ని వెనక్కి పిలిపించి మాట్లాడుతున్నారు. తాజాగా ఒక మేనేజిమెంట్ సంస్థ బోణీ కొట్టింది. అమరావతికి శుభారంభం పలుకుతూ ఎక్స్ఎల్ఆర్ఐ (జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్) అనే సంస్థ పెట్టుబడులకు ముందుకొచ్చింది. మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లో దేశంలోనే ఈ సంస్థకు మంచి పేరుంది. అహ్మదాబాద్ ఐఐఎం తర్వాతి స్థానం ఈ సంస్థదే.
అంతేకాకుండా ఈ సంస్థలో ప్లేస్ మెంట్ లకు బాగా గిరాకీ ఉంది. మేనేజ్మెంట్ కోర్సుల్లో తరగతుల నిర్వహణ, శిక్షణలో ఎక్స్ఎల్ఆర్ఐకి మంచి పేరుంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థకు 50 ఎకరాలు కేటాయించిన సీఆర్డీఏ భూమిని కూడా రిజిస్టర్ చేసింది. అయితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం హడావుడి చేయటంతో … ఎక్స్ఎల్ఆర్ఐ పనులు నిలిపివేసి వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సంస్థ ముందుకు వచ్చింది. కేటాయించిన భూములు అప్పగిస్తే నిర్మాణాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపథ్యంలో ఎక్స్ఎల్ఆర్ఐకి భూములు అప్పగించేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. దాదాపు రూ.250 కోట్ల వ్యయంతో భవనాలను నిర్మించనున్నారు.
త్వరలోనే ఇక్కడ మేనేజ్మెంట్ కోర్సుల తరగతులు మొదలవుతాయి. ఈ సంస్థ క్యాంపస్ ప్లేస్ మెంట్ లకు పేరెన్నిక గన్నది. అందుచేత ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా ఇది శుభవార్త అనే అనుకోవాలి.