జమ్ముకశ్లీర్లో నిర్మిస్తున్న జెడ్ మోర్ టన్నెల్ నిర్మాణ పనుల్ని కేంద్ర మంత్రి గడ్కరీ పరిశీలించారు. ఈ రహదారి సొరంగమార్గం శ్రీనగర్ నుంచి సోన్ మార్గ్ వరకు అనుసంధానమై ఉంటుంది. తీవ్రమైన మంచు కురిసే సమయంలో …ప్రతికూల పరిస్థితుల్లో ఈ మార్గాన్ని వినియోగిస్తారు. అలాగే జోజిలా టన్నెల్ పనుల్ని కూడా మంత్రి సమీక్షించారు. జోజిలా టన్నెల్ కనుక పూర్తైతే దేశంలో పొడవైన రహదారి సొరంగం అవుతుంది. అంతేకాదు 11 వేల 578 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆసియాలో పొడవైన టూ వే టన్నెల్ అవుతుంది. కార్గిల్, సోన్ మార్గ్ గుండా జోజిల్ ఘాట్ల ద్వారా వెళ్తూ నేషనల్ హైవే వన్ కు అనుసంధానం అవుతుంది ఈ టన్నెల్.శ్రీనగర్, లేహ్-లద్దాఖ్ ప్రాంతానికి మధ్య ఉన్న జాతీయ రహదారి నెం.1లో జోజిలా పాస్ కీలకమైంది. రక్షణపరంగా వ్యూహాత్మకమైంది.
హిమపాతం కారణంగా ఈ ప్రాంతంలో నెలలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోతుంటాయి.
శీతాకాలంలో మిలటరీ వాహనాలు కూడా ముందుకు వెళ్లలేని స్థితి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలు, సమయం కూడా వృధా అవుతోంది. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్కు రహదారి టన్నెల్ను నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు.
ఈ టన్నెల్ కనుక పూర్తైతే ఆ సమస్య ఉండదు. ఏడాది పొడవునా రాకపోకలు సాగించవచ్చు, జమ్ముకశ్మీర్ ఆర్థికాభివృద్ధి సహా సమగ్రాభివృద్ధికి ఈ టన్నెల్ దోహదకారి అవుతుందని…కశ్మీర్, లేహ్, లద్దాఖ్ ప్రజలకు ఈ మార్గం జీవనరేఖగా మారుతుందని ఈ సందర్భంగా గడ్కరీ అన్నారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి చెందిన మేఘా కంపెనీ ఈ టన్నెల్ ను నిర్మిస్తోంది. 2026 సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చినప్పటికీ 2023 చివరకల్లా పూర్తిచేయాలని సంస్థ అధిపతి కృష్ణారెడ్డిని గడ్కరీ కోరారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జోజిలా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. సొరంగంలో ఎల్ఈడీ లైట్లు, సీసీ కెమెరాలు, టెలిఫోన్, ఫైర్ అలార్మింగ్ వ్యవస్థ వంటి సౌకర్యాలు ఉంటాయి. గాలి, వెలుతురు, భద్రత కోసం సొరంగం పైనుంచి మూడు వెంటిలేషన్ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. బల్తాల్ వద్ద కొండ ప్రాంతాల్లో మొదలై మీనా మార్గ్ వద్ద సొరంగ మార్గం ముగుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా జోజిలా టన్నెల్తోపాటు ఎంఈఐఎల్ రెండు చిన్న టన్నెల్లను, బ్రిడ్జ్లను, రహదారిపై మంచు పడకుండా ఇతర నిర్మాణాలను చేపట్టింది. ఇదే జాతీయ రహదారిపై జీ-మోర్ నుంచి జోజిలా మధ్య మరో కంపెనీ నిర్మిస్తున్న రెండు చిన్న సొరంగ మార్గాలను కూడా మంత్రి సందర్శించారు.