కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నుంచీ దేశంలోని పురాతన ఆలయాల గురించి చర్చ మొదలైంది. కాశీ కారిడార్ తరహాలో మధురలోనూ ఏదన్నా ఏర్పాటు చేసి కృష్ణ జన్మస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని అక్కడి బీజేపీ ఎంపీ హేమామాలిని వ్యాఖ్యానించారు. ఇక హిందూ సంస్కృతీ వైభవాన్ని చాటే ఆలయాల పునరుద్ధరణ జరగాలని అభిప్రాయపడ్డారు గోవా సీఎం ప్రమోద్ సావంత్.
హిందూ ఆలయాలు, హైందవ సంస్కృతి కాపాడుకోవాలి. ముఖ్యంగా పురాతన ఆలయాల్ని పునర్నిర్మించే శక్తి మాకు ప్రసాదించాలని వేడుకుంటున్నానని ఆయన అన్నారు. పోర్చుగీసుల ఏలికలో గోవాలోని వందలాది ఆలయాల విధ్వంసం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 60వ గోవా విమోనచనోత్సవం సందర్భంగా అన్ని ఆలయాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. పోండాలోని మంగూషిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నిత్యం వేలాదిమంది పర్యాటకులు సందర్శించే మంగూషి ఆలయం రాష్ట్రంలో ప్రముఖ యాత్రాస్థలం అని చెప్పవచ్చు.
పోర్చుగీసుల పాలనలో ధ్వంసమైన ఆలయాల్లో కొన్నింటిని గోవా విమోచనం తరువాత స్థానికులే పునర్నిర్మించుకున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. వెర్నాలోని మల్సా ఆలయం సహా కొన్ని ఆలయాలను తీర్చి దిద్దడంలో ప్రభుత్వం కూడా సాయపడిందన్నారు.