దటీజ్ కాంగ్రెస్!!!
నిర్మాణాత్మక ప్రతిపక్షం అనే పదం కాంగ్రెస్ డిక్షనరీలోనే లేనట్టుంది. ప్రజలు రెండు సార్లూ… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించి ఆ పార్టీని కఠినంగా శిక్షించారు. అయినా పరివర్తన వచ్చిన దాఖలాలు లేవు. దేశానికి ఏది మంచో దాన్ని వ్యతిరేకించడం, ఏది మంచిది కాదో దాన్ని సమర్థించడం ఇంకా ఆ పార్టీకి అలవాటుగానే ఉన్నట్టుంది. చివరకు కరోనా వైరస్ విషయంలో కూడా విద్వేషపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నది.
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రావడం మనందరికీ గర్వకారణం. శాస్త్రవేత్తలు కష్టపడి తయారు చేసినా, నిపుణులు పరీక్షించి నిర్ధారించినా, దేశ వ్యాప్తంగా డాక్టర్లు దాన్ని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, కాంగ్రెస్ నేతలు మాత్రం అది సురక్షిత వ్యాక్సిన్ కాదంటున్నారు. అంటే వీళ్లు ఏమైనా సైంటిస్టులా? కాంగ్రెస్ లో కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ, శశిథరూర్, జైరాం రమేష్ ఇది సేఫ్ కాదని పదే పదే వాదిస్తున్నారు. వీళ్లెవరూ శాస్త్రవేత్తలు కారు. ఔషధాలపై ఎలాంటి అనుభవం గానీ అర్హత గానీ లేదు. మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే దుగ్ధ కావచ్చు. లేదా మోడీపై ద్వేషాన్ని ఇలా వెళ్లగక్కాలని అనుకోవడం కావచ్చు.
తమ రాష్ట్రంలో కోవాగ్జిన్ ఉపయోగించేది లేదని ఛత్తీస్ గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టి.ఎస్. సింగ్ దేవ్ ప్రకటించారు. భారత్ బయోటెక్ తగిన ప్రమాణాలు పాటించి, తయారు చేసిన వ్యాక్సిన్ ఇది. నిపుణులు నిర్ధారించిన తర్వాతే దీనికి తగిన అనుమతులు మంజూరయ్యాయి. అయినా కుటిల రాజకీయాలు మానడం కాంగ్రెస్ కు అలావాటు లేనట్టుంది. ఎప్పట్లాగే విద్వేషాన్ని వెళ్లగక్కడం మానలేదు. దటీజ్ కాంగ్రెస్.