పంతం పట్టరాదు పట్టినచో విడవరాదు అని ఒక సామెత చెబుతుంటారు. సమాజంలో నాయకత్వ స్థాయిలో అన్న వ్యక్తులకు ఈ సామెత చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఈ సామెత రుజువయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంతం పట్టి ప్రభుత్వాన్ని మార్చి అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. దటీజ్ చంద్రబాబు అనిపించుకున్నారు.
2019 24 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండేది. అప్పట్లో కేవలం 23 సీట్లు మాత్రమే టిడిపికి ఉండేవి. ఆ సమయంలో తెలుగుదేశం నాయకుల్ని వైసిపి ఎమ్మెల్యేలు తీవ్రంగా ట్రోల్ చేస్తుండేవారు.
ఈలోగా మరో నలుగురు శాసనసభ్యులు వైసీపీలోకి జారిపోవడం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసిపి ప్రభంజనం లా గెలుపొందడం జరిగిపోయాయి. దీంతో వైసిపి నాయకుల వేధింపులు మరింత పెరిగాయి. అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద అవాకులు, చవాకులు పేలడం ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో
2021 ఏడాది నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, సభలో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఓ శపథం చేశారు. కౌరవసభను గౌరవ సభగా మార్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. అప్పటిదాకా అసెంబ్లీకి వచ్చేది లేదని ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చేసారు. దీని మీద అప్పటి వైసిపి నాయకులు చాలా సెటైర్లు వేశారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశం కలకలం రేపింది. తెలుగు దేశాన్ని గెలిపించుకుని అసెంబ్లీలోకి అడుగు పెడతానని చంద్రబాబు పదేపదే చెప్పుకొని వచ్చారు. చంద్రబాబుని కుప్పంలోనే ఓడించేస్తామని వైసిపి నేతలు సెటైర్లు వేశారు. చివరకు ఎన్నికల ఫలితాల్లో వైసిపి అట్టర్ ప్లాప్ అయింది. వై నాట్ 175 అంటూ హడావిడి చేసిన వైసిపి ఆఖరికి 75 25 సీట్లు కూడా దక్కించుకోలేదు కేవలం 11 సీట్లకు పరిమితం అయింది త్వరలోనే ఇందులో కూడా కొందరు ఎమ్మెల్యేలు టిడిపికి జంప్ అవుతారని అప్పుడే ప్రచారం కూడా మొదలైంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పసుపు పండగ ఆవిష్కృతమైంది. తెలుగు దేశాన్ని గెలిపించుకుని అసెంబ్లీలో అడుగు పెడతాను అన్న చంద్రబాబు ప్రతిజ్ఞ నిజమైంది. జనసేన బిజెపి పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి 164 సీట్లను దక్కించుకున్నారు దాదాపు 90% పైగా మార్కులు సంపాదించుకున్నట్లు అనమాట.
టిడిపి ఎమ్మెల్యేల హర్షద్వానాల మధ్య చంద్రబాబు నాయుడు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అధ్యక్షా అంటూ నినదించారు దైవసాక్షిగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు.
అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీ గుమ్మానికి చంద్రబాబు గౌరవంగా నమస్కారం చేసి లోపలికి అడుగు పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా పసుపు చొక్కాల రావడంతో అసెంబ్లీ అంతా పసుపుమయంగా మారింది.
మొత్తం అసెంబ్లీనే పసుపు మయంగా మార్చడంతో అంతా దటీజ్ చంద్రబాబు అని ప్రశంసిస్తున్నారు.